జానకీపురం ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ | Public inquiry on jankipuram encounter | Sakshi
Sakshi News home page

జానకీపురం ఎన్‌కౌంటర్‌పై బహిరంగ విచారణ

Apr 30 2015 1:59 AM | Updated on Sep 3 2017 1:07 AM

మండలంలోని జానకీపురం వద్ద ఈనెల 4వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై బుధవారం మోత్కూరు తహసీల్దార్

మోత్కూరు: మండలంలోని జానకీపురం వద్ద ఈనెల 4వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై బుధవారం  మోత్కూరు తహసీల్దార్ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ, మెజిస్టీరియల్ విచారణ అధికారి బి.కిషన్‌రావు బహిరంగ విచారణ జరిపారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాదులు అస్లామ్‌అయూక్‌ఖాన్, మహ్మద్‌ఎజాజొద్దీన్‌లతో పాటు ఆత్మకూరు ఎస్‌ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉద యం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు, మృతిచెందిన పోలీ సుల బంధువులను, రెవెన్యూశాఖ, వైద్యాధికారులను విచారించారు. 36 మందికి నోటీసులు పంపగా విచారణకు 24 మంది హాజరై వాంగ్మూలాలను ఇచ్చారు.

12 మంది గైర్హాజర్ అయ్యారని, పోలీసు విచారణ అధికారి బృందానికి చెందిన 7గురిని తదుపరి పిలిపించి విచారించనున్నట్లు ఆర్డీఓ కిషన్‌రావు తెలిపారు. మొదటగా ఉగ్రవాదులకు పోస్టుమార్టం నిర్వహించిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి చెందిన సివిల్‌సర్జన్ డాక్టర్లు టి.నర్సింగరావు, మాతృ, కె.ప్రసాద్‌రా వు, వినోద్‌కుమార్, బి.శోభారాణిలను ఆర్డీఓ విచారించారు. జానకీపురం వీఆర్వో సత్యనారాయణను ఎదురుకాల్పుల సంఘటన స్థలంలో ఏమి చూశా వు, అక్కడ ఏమి పరిశీలించావు, మృతుల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించి అతడి స్టేట్‌మెంట్‌ను ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. మృతిచెందిన కానిస్టేబుల్ నాగరాజు భార్య సంజన, ఆయన తల్లిదండ్రులు శ్రీమన్‌నారాయణ-లక్ష్మమ్మలను నాగరాజు మృతిచెందాడని ఎవరు చెప్పారని, మీకు ఎలా తెలిసిందని ఆర్డీఓ ప్రశ్నించారు.

 తమకు అధికారికంగా బాధ్యులైన పోలీసులు ఎవరూ సమాచారం ఇవ్వలేదని ఆత్మకూరు ఎస్‌ఐ సిద్ధయ్య కాల్పుల్లో మృతిచెందాడని ఆయనతో పాటు కానిస్టేబుల్ నాగరాజు కూడా  చనిపోయాడని టీవీ చానల్స్‌లో స్క్రోలింగ్‌లు చూసి నిర్ధారించుకున్నామని ఆర్డీఓకు వివరించారు. చికిత్స కోసం హైదరాబాద్ ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించామని తెలపడంతో అక్కడికి తామువెళ్లిచూశామని తెలిపారు. నాగరాజు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది మరణించాడని ప్రత్యక్ష సంఘటనలో ఉన్న తోటి కానిస్టేబుల్స్ తమతో చెప్పారని ఆర్డీఓకు వారు వివరించారు. నాగరాజు ఉగ్రవాదనికి కాల్చిచంపిన సమాచారాన్ని కొంతమంది పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

 నాగరాజు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడని తమ విచారణలో నిర్ధారన జరిగిందని నల్లగొండ డీఎస్పీ రాములు నాయక్ ఆర్డీఓకు వివరించారు. మోత్కూ రు ఎస్‌ఐ పురేందర్‌భట్, మోత్కూరు, ఆత్మకూరు, రామన్నపేట పోలీస్‌స్టేన్లకు చెందిన కానిస్టేబుల్స్ బి.వెంకటేశ్వర్లు, కొణతం మధు, ఎల్.జానకిరాం, మంద నిరంజన్, టి.శివకోటశ్వర్‌రావు, ముత్తినేని శ్రీను,హోగార్డు కొంపెల్లి శ్రీనివాస్‌లను ఆయన విచారించారు.వారి ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేశారు. భువనగిరి ఆర్డీఓ నూతి మధుసూదన్, డీఎస్పీ సాదుమోహన్‌రెడ్డి, ఎస్‌ఐ సిద్ధయ్య భార్య ధరణిష, ఆయన సోదరులు దస్తగిరి, పెద్దబాషా, శ్రీకాంత్‌రెడ్డి, ఎఫ్‌ఏ సీల్ అధికారి తజియోద్దీన్ విచారణకు గైర్హాజరు అయ్యారని ఆర్డీఓ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement