ఉధృతమైన సీబీఐటీ విద్యార్థుల ఆందోళన..! | Protest against CBIT fee hike continues | Sakshi
Sakshi News home page

Dec 11 2017 10:33 AM | Updated on Nov 9 2018 4:46 PM

Protest against CBIT fee hike continues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట్‌ సీబీఐటీ కాలేజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన సోమవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఐదురోజులుగా ఆందోళన చేస్తున్నా.. సీబీఐటీ యాజమాన్యం తమ గోడును పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలు.. పిన్సిపల్‌ రూమ్‌లోకి చొచ్చుకెళ్లి బైఠాయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపుటాల చోటుచేసుకుంది. విద్యార్థులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్‌ చాంబర్‌లోనే ఏబీవీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సీబీఐటీ కాలేజీ వారం రోజులు సెలవు ప్రకటించింది. మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి ఫీజుల పెంపు సమస్యను పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్‌ ప్రకటించారు.

ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు కొనసాగిస్తున్న ఆందోళనకు ఏబీవీపీతోపాటు పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున గుమిగూడిన విద్యార్థులు గండిపేట్‌ నుంచి కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. సీబీఐటీ యాజమాన్యం పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. శంకర్‌పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీ బస్సులను ఏబీవీపీ అడ్డుకుంది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement