ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం: హరీశ్‌

Ponds integration with projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చెరువులు, కుంటలను ప్రాజెక్టులకు అనుసంధానించి వాటిని ఆ నీటితో నింపాలని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు పటిష్టమైన మైనర్‌ ఇరిగేషన్‌ నెట్‌వర్క్‌ సిస్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం జలసౌధలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవసరాలకు అనుగణంగా సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల రీ–డిజైనింగ్‌ చేశారని, తెలంగాణలోని బీడు భూముల్లో నీరు పారించేలా ప్రణాళికలు తయారు చేశారని వివరించారు.

జిల్లాల వారీగా మేజర్, మైనర్‌ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న గొళుసు కట్టు చెరువులను గుర్తించి వాటిని ఏ ప్రాజెక్టు నీటి ద్వారా నింపే అవకాశం ఉందో తెలుసుకోవాలన్నారు. ప్రతీ ప్రాజెక్టు నుంచి గొలుసు కట్టు చెరువులు నింపాలన్నది ప్రభుత్వ ఆలోచన అని, ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టు సీఈలు, ఎస్‌ఈలు, మైనర్‌ ఇరిగేషన్‌ ఇంజనీర్లు నెల రోజుల్లో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చెరువులను నింపడం ద్వారా రాష్ట్రానికి పూర్తి స్థాయిలో నీటి భద్రత లభిస్తుందన్నారు. అంతకుముందు మైనర్‌ ఇరిగేషన్‌ వ్యవస్థ, గొళుసు కట్టు చెరువుల తాజా పరిస్థితిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులు వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top