గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం పలువురు అధికారులు తనిఖీ చేశారు.
- ‘ఇన్ఫెక్షన్ బారిన బాలింతలు’ ఘటనపై విచారణ
- ఆపరేషన్ థియేటర్లో శాంపిల్స్ సేకరణ
- పలు వార్డుల్లో తనిఖీలు
- పారిశుద్ధ్య కాంట్రాక్టర్ను సస్పెండ్ చేసిన కలెక్టర్
గజ్వేల్: గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం పలువురు అధికారులు తనిఖీ చేశారు. పారిశుద్ధ్య లోపంతో పలువురు బాలింతలు అస్వస్థతకు గురికాగా, సాక్షి శనివారం సంచికలో ‘ఇన్ఫెక్షన్ బారిన బాలింతలు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందిం చిన డీసీహెచ్ఎస్ (డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్) డాక్టర్ కిరణ్ శనివారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. బాలింతల అస్వస్థతకు గల కారణాలపై విచారణ జరిపారు. అనంతరం ఆపరేషన్ థియేటర్లో పలు శాంపిల్స్ సేకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. బాలింతలు అస్వస్థతకు గురయ్యేందుకు గల కారణాలను తెలుసుకునేంత వరకూ ఆపరేషన్ థియేటర్ను బంద్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్యలోపం తీరును పరిశీలించారు.
ఆస్పత్రిని సందర్శించిన ఆర్డీఓ
గజ్వేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు అస్వస్థతకు గురైన ఘటన నేపథ్యంలో శనివారం సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి సైతం ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారిణి పద్మ తదితర అధికారులు సైతం ఆస్పత్రిని తనిఖీ చేశారు.
ఆస్పత్రి శానిటేషన్ కాంట్రాక్టర్ సస్పెన్షన్
సంగారెడ్డి అర్బన్: గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వర్తించని శానిటేషన్ కంట్రాక్టర్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డా.ఎ.శరత్ ఒక ప్రకటనలో తె లిపారు. గజ్వేల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపంతో పలువురు బాలింతల ఆస్వస్థతపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి ఆయన తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించాలని గజ్వేల్మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న బాలింతల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, పూర్తిస్థాయిలో మందులను అందిస్తున్నట్టు చెప్పారు.