బోగస్ ఓటుకు నోటీసు..! | Notice to the Bogus vote | Sakshi
Sakshi News home page

బోగస్ ఓటుకు నోటీసు..!

Jul 22 2015 11:38 PM | Updated on Sep 3 2017 5:58 AM

బోగస్ ఓటర్ల ఏరివేత ప్రక్రియలో భాగంగా సిద్దిపేట పట్టణ పరిధిలోని వేలాది మంది ఓటర్లకు రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేయనుంది.

సిద్దిపేట జోన్ : బోగస్ ఓటర్ల ఏరివేత ప్రక్రియలో భాగంగా సిద్దిపేట పట్టణ పరిధిలోని వేలాది మంది ఓటర్లకు రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేయనుంది. గతంలో పలుమార్లు క్షేత్ర స్థాయిలో విచారణ, సర్వే నిర్వహించి ఓటర్ జాబితాకు ఆధార్‌కార్డును అనుసంధానం చేసే విధానాన్ని అధికారులు చేపట్టారు. అయినప్పటికి సంబంధిత జాబితాలో నేటికి సుమారు 23వేల మంది అధికారికంగా పట్టణంలో అనుసందానానికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక్క దశలో  కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్డీ ఓ ముత్యంరెడ్డి పర్యవేక్షణలో 23 వేల మందికి నోటిసులు జారీ చేయడం మొదలు పెట్టారు. మొదటి ద ఫాలో నోటిసులను అందుకున్న వారిలో ఇప్పటికి సుమారు 3 వేల మంది తమ  ఆధార్ నంబర్‌ను ఓటర్ జాబితాతో సీడింగ్  చేయించినట్లు సమాచారం.

 20 వేల మంది ఓటర్లు ఎక్కడా..
 మరో వైపు సిద్దిపేట పట్టణంలోని 20 వేల ఓటర్లు ఆధార్ సీడింగ్ కు ముందుకు రావడం లేదని  యంత్రాంగం గుర్తించింది. గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం, సమీక్షలు, ఆవగాహన సదస్సులు నిర్వహించినప్పటికి ఇప్పటికి పట్టణంలో 20 వేల మంది ఆచూకిని కనుక్కోవడంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.మరో మారు సంబంధిత వ్యక్తులకు నోటిసులు జారీ చేసి చివరి అవకాశం ఇచ్చి అప్పటికీ  స్పందించకుంటే జాబితా నుంచి శాశ్వతంగా పేర్లను తొలగించేందుకు అధికార యంత్రాంగం సమయాత్తమవుతోంది.

 ఇంటింటికి వెళ్లి విచారించినా..
 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలీటి గా గుర్తింపు పొందిన సిద్దిపేటలో లక్షకు పై చిలుకు జనాభా ఉంది. 2015 రికార్డుల ప్రకారం ఇటీవల మున్సిపల్ విడుదల చేసిన జాబితాలో 88వేల పై చిలుకు ఓటర్లు  ఉన్నారు. ప్రతి ఓటర్‌కు ఆధార్ నంబర్‌ను  అనుసంధానం చేసి బోగస్ ఓటర్ల ఏరివేతతో పాటు ఓటర్ జాబితా ప్రక్షాళనకు సిద్దిపేట అధికారులు శ్రీకారం చుట్టారు. విస్తృతంగా ప్రత్యేక క్యాంపును , నమోదు ప్రక్రియను చేపట్టిన అధికారులకు గత నెలలోనే 23 వేల మంది ఓటర్లు సీడింగ్ కు దూరంగా ఉన్నట్లు గుర్తించారు.

ఒక్క దశలో పట్టణంలోని 34 వార్డులను ఆయా అంగన్‌వాడీ కేంద్రం వర్కర్ , మెప్మా ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలోనే సమ్రగ విచారణ జరిపించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ జాబితాను పరిగణలోకి తీసుకొని ఓటర్లకు ఆధార్‌ను సీడింగ్ చేసే  విధానాన్ని వేగ వంతంచేశారు. అయినప్పటికీ సిద్దిపేట పట్టణంలోనే 23 వేల మంది ఓటర్లు సీడింగ్‌కు ముందుకు రావడంలేదు.
 
  నోటీసుల జారీ వేగవంతం..
 రెవెన్యూ యంత్రాంగం ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకొని ఆనుసంధానానికి దూరంగాఉన్న ఓటర్లకు వ్యక్తి గతంగా నోటీసులను జారీ చేసే ప్రక్రియను చేపడుతున్నారు. ముఖ్యంగా ఓటర్ జాబితాలో ఉన్న వారిలో కొందరు వలసలకు వెళ్లడం , మృతి చెందడం, రెండు చోట్ల ఓటరు జాబితాలో పేర్లు కలిగి ఉండడం , వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు ఆధార్ సిడింగ్ దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ మరో ప్రయత్నంగా రెవెన్యూ యంత్రాంగం రెండవ దశలో నోటీసుల జారీ చేసి అర్హులైన వారికి జాబితాలో అవకాశం కల్పించడం , అనర్హులను తొలగించి బోగస్ ఓటర్లను ఏరివేయడం లాంటి ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement