నిమ్స్‌ ఇకపై ఎయిమ్స్‌ | NIMS Bibinagar land handed over to government | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ ఇకపై ఎయిమ్స్‌

Feb 9 2019 1:37 AM | Updated on Feb 9 2019 1:37 AM

NIMS Bibinagar land handed over to government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2019–20 విద్యా సంవత్సరం నుంచే హైదరాబాద్‌ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించటంతో ఇందుకు అనుగుణంగా బీబీనగర్‌ నిమ్స్‌ భవనాన్ని ఎయిమ్స్‌కు రాష్ట్ర అధికారులు అప్పగించారు. దీనికి ఇటీవల రూ.1028 కోట్ల నిధులకు కూడా కేంద్రం కేటాయించింది. 45 నెలల్లో ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సూచించింది.ఈ నేపథ్యంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన భూ, భవన నిర్మాణం సహా అన్ని రకాల పత్రాలను ఎయిమ్స్‌కు అధికారులు అందజేశారు. ఇప్పటి వరకు నిమ్స్‌ ఆధ్వర్యంలో ఉన్న రూ.200 కోట్లకుపైగా విలువ చేసే రెండు బహుళ అంతస్తుల భవనాలు, 151 ఎకరాల భూమి సహా రూ.60 లక్షల విలువ చేసే లేబొరేటరీ, వైద్య పరికరాలు ఎయిమ్స్‌ అధీనంలోకి వెళ్లాయి. దీంతో నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ఆర్థికంగా నష్ట పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు యాదాద్రిజిల్లా రెవెన్యూ అధికారులు ఇటీవల మరో 49 ఎకరాల భూమిని సేకరించి ఎయిమ్స్‌కు సమకూర్చారు.

ఓపీ సేవలు కొనసాగుతాయి
అనేక విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 2016 మార్చిలో బీబీనగర్‌ నిమ్స్‌లో అవుట్‌ పేషెంట్‌ సేవలను ప్రారంభించింది. త్వరలోనే ఇన్‌ పేషెంట్‌ సేవలను ప్రారంభించాలని నిర్ణయిం చింది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే కేంద్రం రాష్ట్రానికి ఎయిమ్స్‌ మంజూరు చేసింది. ఎయిమ్స్‌ సేవలు ప్రారంభమయ్యే వరకు ఓపీ సేవలు కొనసాగుతాయని బీబీనగర్‌ నిమ్స్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement