రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాల విస్తరణకు పూర్తికాలం వెచ్చించి పనిచేసే కార్యకర్తలకు మోటార్ సైకిళ్లను అందజేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాల విస్తరణకు పూర్తికాలం వెచ్చించి పనిచేసే కార్యకర్తలకు మోటార్ సైకిళ్లను అందజేయనున్నారు. ఇందుకు ఉద్దేశించిన 150 మోటార్ సైకిళ్లు ఉత్తర ప్రదేశ్ నుంచి బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేసే ఫుల్టైమర్లతో పాటు 31 జిల్లాలకు పూర్తికాలం కార్యకర్త లుగా (ఇన్చార్జులుగా) నియమించే వారికి ఈ బైకులను పంపిణీ చేయనున్నారు.
ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో పని చేసేందుకు 86 మంది ఫుల్టైం కార్యకర్తలను ఇప్పటికే ఎంపిక చేసి.. వారికి వర్క్షాపులు, శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని కార్యవిస్తారక్ యోజన రాష్ట్ర ఇన్చార్జి కాసం వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. ఏడాది నుంచి రెండేళ్లపాటు పనిచేసే వారికే ఈ బైకులను అందజేసి, వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పూర్తికాలం పని చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.