మార్క్‌ఫెడ్‌ ద్వారానే మక్కల కొనుగోళ్లు  | Markfed to purchase maize at MSP from Telangana | Sakshi
Sakshi News home page

మార్క్‌ఫెడ్‌ ద్వారానే మక్కల కొనుగోళ్లు 

Apr 8 2018 3:18 AM | Updated on Aug 15 2018 9:06 PM

Markfed to purchase maize at MSP from Telangana - Sakshi

కె.చంద్రశేఖర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: యాసంగిలో పండిన మక్కలకు కనీస మద్దతు ధర చెల్లించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ ఫెడ్‌ ద్వారానే కొనుగోలు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, ఎండీ జగన్‌మోహన్‌ శనివారం సీఎంకు తెలిపారు. మక్కల కొనుగోలుకు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌ మార్క్‌ఫెడ్‌కు కావాల్సిన గ్యారంటీ ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరిచి, మార్క్‌ఫెడ్‌ను సమన్వయం చేసుకుని మక్కల కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్‌ రావును కోరారు. ‘‘రైతులెవరూ తక్కువ ధరకు మక్కలను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. క్వింటాలుకు రూ.1,425 చెల్లించి ప్రభుత్వం తరçఫునే కొనుగోలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. రైతులు తొందరపడి మక్కలను తక్కువ ధరకు అమ్ముకోవద్దు. రూపాయి కూడా నష్టపోకుండా చూడాలి’’అని  సీఎం అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement