భయం.. భయంగా..  | Jvr Opencast Mine Bomb Blasts Lead Respiratory Diseases To surrounding Village People In Khammam | Sakshi
Sakshi News home page

భయం.. భయంగా.. 

Jun 21 2019 11:04 AM | Updated on Jun 21 2019 1:30 PM

Jvr Opencast Mine Bomb Blasts Lead Respiratory Diseases To surrounding Village People In Khammam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా): సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓసీలో బొగ్గు తవ్వకాలతో ఎన్టీఆర్‌ కాలనీకి ముప్పు ఏర్పడింది. కాలనీ ఓపెన్‌కాస్ట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఎన్టీఆర్‌ కాలనీలో సుమారు 579 ఇళ్లు ఉన్నాయి. వీటిలో ముప్పావంతుకు పైగా దెబ్బతిన్నాయి. గనిలో బొగ్గు వెలికితీతకు బాంబులు పేల్చేటప్పుడు భూమి కంపిస్తోంది. శ్లాబులు పెచ్చులూడి పడిపోతున్నయి. ఇళ్లు ఊగిపోతున్నాయి. చాలా మంది కర్రలు పోటుపెట్టి బతుకీడుస్తున్నారు.

బాంబుల తీవ్రత తగ్గిం చాలని పలుమార్లు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈసమస్యను స్థానిక ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వం కానీ, సింగరేణి సంస్థ కానీ స్పందించడంలేదు. సీఎం క్యాంప్‌ ఆఫీస్, సింగరేణి సీఎండీ శ్రీధర్, సింగరేణి డైరెక్టర్‌కు పలు మార్లు విజ్ఞప్తులు పంపించామని, అయినా ఫలి తం కన్పించటం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పరిశీలనలతోనే సరి 
ఎన్టీఆర్‌నగర్‌ కాలనీ వాసులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అధికారులు మొక్కబడిగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి పోతున్నారు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. సింగరేణి ఏరియా జీఎం, పీఓ వచ్చి పరిశీలించి వెళ్లారు. కానీ ఎలాం టి చర్యలూ తీసుకోలేదు. ఇటీవల స్థానికులు ఖమ్మం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో బుధవారం రెవెన్యూ, మైనింగ్, సర్వే సిబ్బంది దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. 

న్యాయం చేస్తామని కానీ, పరిహారం ఇస్తామనికానీ హామీ ఇవ్వలేదు. ఇంటింటి సర్వే నిర్వహించి ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లతో పరిశీలన చేయించాలని, ఇల్లు ఎంతమేరకు దెబ్బతిన్నాయి..? నివాస యో గ్యానికి పని చేస్తాయా..? తదితర అంశాలను స్పష్టంగా తేల్చాలని బాధితులు కోరుతున్నారు. దెబ్బతిన్న ఇళ్లను తొలగించి కొత్త ఇళ్లను కట్టించాలని, లేని పక్షంలో సింగరేణి స్వాధీనం చేసుకొని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

కాలుష్యంతో జబ్బులు 
సింగరేణి బొగ్గు తవ్వకాలతో వాతావరణం కలుషితమై కాలుష్యం పెరిగిపోయి రోగాల బారినపడుతున్నారు. ఛర్మ వ్యాధులు, కిడ్ని, శ్వాసకోశ, కణితులు, దృష్టిలోపం, లీవర్‌ వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బొగ్గు నుసితో నల్లగా మారిపోతున్నాం. మంచినీళ్లతో సహా అన్నీ కలుషితం అవుతున్నాయి.

ఇప్పటికే చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు మొరపెట్టుకోగా కంటితుడుపు చర్యగా మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించారు కానీ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. సింగరేణి సంస్థ ఇంటింటి సర్వే నిర్వ హించి హెల్త్‌కార్డులు ఇచ్చి సింగరేణి ఆస్పత్రిలో ఉచిత వైద్యం సహాయం అందించాలని ప్రజల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement