
ముస్లింలకు రాజధాని దారుస్సలాం
దేశానికి ఢిల్లీ రాజధాని అయినా యావత్ ముస్లింలకు మాత్రం హైదరాబాద్ దారుస్సలాం రాజధాని అని ఏఐఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
⇒ ఉత్తరప్రదేశ్లో గాడిదలపై రాజకీయం
⇒ ఏఐఎంఐఎం 59వ వార్షికోత్సవ సభలో అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఢిల్లీ రాజధాని అయినా యావత్ ముస్లింలకు మాత్రం హైదరాబాద్ దారుస్సలాం రాజధాని అని ఏఐఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో జరిగిన ఎంఐఎం 59వ వార్షికోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. దేశంలోని ముస్లింల పక్షాన గళం విప్పే ఏకైక పార్టీ మజ్లిస్ అని, యావత్ ముస్లింల చూపు దారుస్సలాం రాజకీయలపైనే ఉందన్నారు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముస్లింలే కీలకంగా మారారన్నారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించి ముస్లింలకు ఎక్కడ అన్యాయం జరిగినా గళం విప్పి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.
ఆలేరు ఎన్కౌంటర్ బాధ్యులను జైలుకు పంపించి తీరుతామని, ఎన్కౌంటర్ బాధిత కుటుం బాలకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. మక్కా మసీదు ఘటనలో నిరప రాధులైన అమాయకులకు న్యాయం జరిపిం చి సాక్షాత్తు అప్పటి సీఎంచేత క్షమాపణ చెప్పించిన ఘనత మజ్లిస్ పార్టీదేనన్నారు. ఆలేరు ఘటనపై సైతం సరైన సమయంలో సరైన రాజకీయం చేసి బాధితులకు న్యాయం చేకూర్చి తీరుతామని స్పష్టం చేశారు. రాజకీ యాల్లో రెడ్డి, రావు, లింగాయత్, మారాఠా, బహుజనులు, యాదవ్, ప్రతి ఒక్కరూ వాణి వినిపిస్తూ వచ్చారని, ఇప్పుడు గాడిదలు కూడా వాణిని వినిపిస్తున్నాయని అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు.
‘ఉత్తర ప్రదేశ్లో నిరుద్యోగం, ఆహారం, అభివృద్ధి వంటి అంశాలను పక్కకు పెట్టి గాడిదలపై రాజకీయం జరగడం విడ్డూరంగా ఉంది, రాజకీయాలకు ఎలాంటి దుర్గతి పట్టింది’ అని విచారం వ్యక్తం చేశారు. చాయ్ వాలా వచ్చిన తర్వాత గాడిదలకు ప్రాధాన్యత పెరిగిందని, దీంతో రాజకీ యాలు మరింత దిగజారుతున్నాయని విమర్శించారు. పార్టీ జాతీయ కార్యదర్శి ఆహ్మద్ పాషా ఖాద్రీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, నాయకులు, బాధ్యులు పాల్గొన్నారు.