ఎన్డీ తివారీ సేవలు చిరస్మరణీయం: గవర్నర్‌ | Sakshi
Sakshi News home page

ఎన్డీ తివారీ సేవలు చిరస్మరణీయం: గవర్నర్‌

Published Sat, Oct 20 2018 1:57 AM

Governor Narasimhan and YS Jagan Condolences to the ND Tiwari death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీ మృతి పట్ల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సంతాపం తెలిపారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో ఎన్డీ తివారీ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా 2007 ఆగస్టు నుంచి 2009 డిసెంబర్‌ వరకు తివారీ అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. ఆయన మృతితో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. ఢిల్లీలో పనిచేసిన సమయంలో తివారీతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అనితర కృషిచేశారని  కొనియాడారు. యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకూ సీఎంగా పనిచేసిన ఘనత కేవలం ఆయనకే దక్కిందన్నారు. 

వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, నారాయణ్‌దత్‌ తివారీ మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. భారతదేశంలో రెండు రాష్ట్రాలకు  సీఎంగా వ్యవహ రించిన సీనియర్‌ రాజకీయ నాయకుడు ఎన్‌డీ తివారీ ఒక్కరేనని జగన్‌ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్‌ కూడా అయిన తివారీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్‌డీ తివారీ కుటుంబ సభ్యులకు జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement
Advertisement