డెంగీకి ప్రత్యేక చికిత్స

General Hospitals Held Awareness Program On Seasonal Diseases In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : సీజనల్‌ వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి తరపున ప్రత్యేక అవగహన కార్యక్రమాలు చేపడటంతో పాటు ఉచిత చికిత్స అందిస్తున్నామని జిల్లా జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ అన్నారు. జనరల్‌ ఆస్పత్రిలోని సూపరిటెండెంట్‌ ఛాంబర్‌లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ డెంగీ, టైఫాయిడ్‌ వంటి సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న ఇలాంటిì సమయంలో ప్రజలు వారి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా, చెత్త చేరకుండా శుభ్రంగా ఉంచుకోవడం వంటి చిన్న, చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సీజనల్‌ వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. 15 రోజుల్లో ఆస్పత్రికి సుమారుగా ప్రతిరోజు 1300 నుంచి 1500ల మంది అవుట్‌ పేషెంట్లు నమోదవుతుండగా వీరిలో 960 మందికి డెంగీ పరీక్ష నిర్వహించామని అందులో 161 మంది డెంగీ పాజిటివ్‌గా నమోదయ్యారని పేర్కొన్నారు.

శుక్ర, శనివారల్లోనే 53 డెంగీ కేసులు నమోదయ్యాయి. వారందరికీ తగిన చికిత్సలు చేస్తున్నామని, ఎవరికి ప్రాణహాని లేదన్నారు. ఆస్పత్రిలో ప్లేట్లేట్‌కి సంబంధించిన విలువైన యంత్రాలు ఉన్నాయని తెలిపారు. 15 రోజుల్లో 8 మంది ప్రాణపాయ స్థితిలో ఉండగా ఐసీయూలో చికిత్స అందించి వారిని కోలుకునేలా చేశామని తెలిపారు. అనవసరంగా ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. ప్లేట్‌లేట్స్‌ తగ్గాయని ఆందోళన చెందకండని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిరంతరం డెంగీ కేసులను చూస్తున్నామని, ఆదివారం కూడా ఓపీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రాంమోహన్, డీఎంఅండ్‌హెచ్‌ఓ రజిని, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ జెరీనా, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top