పండుగలా అవతరణ వేడుకలు | Sakshi
Sakshi News home page

పండుగలా అవతరణ వేడుకలు

Published Thu, May 28 2015 1:05 AM

పండుగలా అవతరణ వేడుకలు

అధికారులకు  సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశం
జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు కార్యక్రమాలు
పరేడ్ మైదానంలో అవతరణోత్సవాలు
తెలంగాణ సంస్కృతి, వైభవానికి   ఉత్సవాల్లో పెద్దపీట
ట్యాంక్‌బండ్‌పై ముగింపు ఉత్సవాలు

 
హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పండుగలా నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించాలని, ఇందుకోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రులను సంప్రదించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై బుధవారం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న ఉదయం 9 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అమర వీరులకు నివాళి అర్పించేందుకు జిల్లాల్లో అమరవీరుల స్తూపాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, ట్రాఫిక్ ఐలాండ్లు, ప్రధాన ర హదారులను విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు.
 
రాజధానిలో..

 హైదరాబాద్‌లో జూన్ 2న ఉదయం 9.30 నుంచి 11.30 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. పోలీసుల మార్చ్‌ఫాస్ట్, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన ఉంటుంది. రాజ్‌భవన్, నెక్లెస్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్, లుంబినీపార్కు, ట్రాఫిక్ ఐలాండ్లు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. దుకాణాలు, ప్రైవేటు సంస్థల్లోనూ రాష్ట్ర అవతరణ ఉత్సవ లోగోలు ప్రదర్శిస్తారు. రెండో తేదీ రాత్రి 8 గంటలకు పీపుల్స్‌ప్లాజాలో బాణసంచా కాల్చుతారు.
 
వైభవం, సంస్కృతిని చాటేలా..

 తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సాంస్కృతిక వారధి కళాకారులు ‘తెలంగాణ సాంస్కృతిక జైత్రయాత్ర’ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వెల్లడించారు. కళాకారులు ప్రతిరోజు రెండు జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 2న నెక్లెస్‌రోడ్డులో, 3న మెదక్, నిజామాబాద్, 4న ఆదిలాబాద్, కరీంనగర్, 5న వ రంగల్, ఖమ్మం, 6న నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఏడో తేదీన హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భారీ ప్రదర్శన నిర్విహ స్తారు. ఈ కార్యక్రమం సరికొత్త పంథాలో ఉండేలా కళాప్రదర్శనలు రూపొందిస్తున్నారు. ఆవిర్భావ వేడుక లపై తెలంగాణ సాంస్కృతిక వారధి రూపొందించిన 10 వేల సీడీలను, సీఎం కేసీఆర్ సందేశంతో కూడిన తెలంగాణ మాసపత్రిక కాపీలను జిల్లాలకు పంపించారు.
 

Advertisement
Advertisement