ప్రతి విద్యార్థి లెక్క.. ఇక పక్కా! | Education Department Decided to Take Electronic Transfer Policy | Sakshi
Sakshi News home page

ప్రతి విద్యార్థి లెక్క.. ఇక పక్కా!

Apr 17 2018 1:00 AM | Updated on May 25 2018 6:12 PM

Education Department Decided to Take Electronic Transfer Policy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి సంబం ధించిన వివరాలను పక్కాగా సేకరించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఆధార్‌ అను సంధానం చేపట్టినా, పూర్తిస్థాయిలో చేయలేక పోవడం, ఆధార్‌ను బయట పెట్టొద్దన్న నిబంధనల నేపథ్యంలో విద్యా శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక యూనిక్‌ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థి గతేడాది ఎక్కడ చదివాడు.. ప్రస్తుతం ఎక్కడ చదువుతున్నాడు.. అన్న వివరాలను తెలుసుకు నేందుకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి యూనిక్‌ ఐడీని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు ఒక స్కూల్‌ నుంచి మరో స్కూల్‌కు వెళ్లినా.. వేరే జిల్లాకు వెళ్లినా.. వేరే రాష్ట్రానికి వెళ్లినా ఆన్‌లైన్‌లో యూనిక్‌ ఐడీ ద్వారా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనిద్వారా విద్యార్థులు డ్రాపౌట్‌ అయ్యారు.. ఎందరి కుటుంబాలు వలస వెళ్లాయనే వివరాలను తెలుసుకునేందుకు దోహదపడుతుందని భావిస్తోంది.

ఆధార్‌ అనుసంధానం అంతంతగానే..
రాష్ట్రంలోని 40,841 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 58,36,310 మంది విద్యార్థులు చదువుతున్నారు. 30,082 ప్రభుత్వ పాఠశాలల్లో 27,60,761 మంది, 10,759 ప్రైవేటు పాఠశాలల్లో 30,75,549 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్‌ అనుసంధానం బాగానే జరిగినా ఎక్కువ శాతం ప్రైవేటు పాఠశాలల్లో పూర్తిగా జరగలేదు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులందరూ ఆధార్‌ నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 58,36,310 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 53,09,163 మంది విద్యార్థులకే ఆధార్‌ నమోదు పూర్తయింది. మరో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఆధార్‌ లేదు. వారిని గుర్తించి ఆధార్‌ నమోదు చేయించేలా విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ఆధార్‌ నమోదు పూర్తి చేసినా, దాన్ని బయటపెట్టే అవకాశం లేకపోవడం, విద్యార్థులను ట్రాక్‌ చేయడానికి దాన్ని ఉపయోగించడానికి వీల్లేని పరిస్థితుల్లో యూనిక్‌ ఐడీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

కేంద్ర నిర్ణయం నేపథ్యంలో..
పాఠశాలల్లో విద్యార్థులందరి ఆధార్‌ నమోదైనా కాకపోయినా ఆధార్‌ గోప్యత పాటించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఆధార్‌ కలిగిన ప్రతి ఒక్కరికి వర్చువల్‌ ఐడీని ఇచ్చేలా యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) కసరత్తు చేస్తోంది. పాఠశాలల విద్యార్థులకు మాత్రం యూనిక్‌ ఐడీని ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఈటీసీ విధానం అమల్లోకి తెచ్చి యూనిక్‌ ఐడీతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీనిద్వారా విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకుని, తగిన చర్యలు చేపట్టొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement