
జైనథ్ : రైతుల సమస్యలపై పోరాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ను విమర్శించడం మానుకోవాలని బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కోరెడ్డి నర్సింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబి రంగు పురుగు, కింగ్ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ శంకర్ నిర్వహించిన ధర్నాను టీఆర్ఎస్ నాయకులు విమర్శించడం అనైతికమన్నారు. మండలంలో రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లని టీఆర్ఎస్ నాయకులు కేవలం పదవుల కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో గులాబి రంగు పురుగుతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తుంటే, ఇక్కడ ఎందుకు అందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా విమర్శలు మాని రైతులకు ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండి స్వామి, నాయకులు రాకేష్ రెడ్డి, నవీన్, రాకేష్, ఆశీష్, రమేష్ పాల్గొన్నారు.