ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతే | deposits missing to opponents :rajaiah | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతే

Sep 6 2014 12:05 AM | Updated on Mar 9 2019 3:26 PM

మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిదే విజయమని, ప్రత్యర్థుల డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు.

సంగారెడ్డి రూరల్ : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిదే విజయమని, ప్రత్యర్థుల డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. సంగారెడ్డి మండలం చిమ్నాపూర్, కంది గ్రామాలలో శుక్రవారం రాజయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. పేదల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు.

 ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక  బీజేపీ, కాంగ్రెస్  నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం తమ ప్రభుత్వం రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల వ్యవసాయ భూమి, సామాజిక పెన్షన్ల పెంపునకు కట్టుబడి ఉందని వెల్లడించారు. సమగ్ర సర్వేకు ప్రజలకు ఇబ్బం దులు వస్తాయంటూ ప్రత్యర్థి పార్టీల నాయకుల దు ష్ర్పచారాన్ని నమ్మవద్దని కోరారు. అర్హులైన వారంద రి కీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసేందుకే సమగ్ర సర్వే నిర్వహించినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కోసం రూ. లక్ష కోట్లతో బడ్డెట్‌ను రూపొం దిస్తున్నట్లు వివరించారు.

 సంగారెడ్డిలో వందపడకల ఆస్పత్రిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి ఓటేస్తే అది వృధా అవుతుందన్నారు. అనంతరం చిమ్నాపూర్‌కు చెందిన పలువురు ఆయా పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.  ప్రచార కార్యక్రమంలో వర్ధన్న పేట ఎమ్మెల్యే రమేష్ , సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీటీసి మనోహర్ గౌడ్, సర్పంచ్‌ల ఫోరం  మండల అధ్యక్షుడు రామ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు నరహరి రెడ్డి, నందకిషోర్, ఖాజాఖాన్, ఎంపీటీసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement