‘ఐటీ గ్రిడ్స్‌’లో మరోసారి సోదాలు | Sakshi
Sakshi News home page

‘ఐటీ గ్రిడ్స్‌’లో మరోసారి సోదాలు

Published Tue, Mar 5 2019 1:41 PM

Cyberabad Police Continued Searches In IT Grid Company - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా టీడీపీ యాప్‌ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో మరోసారి సైబరాబాద్‌ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. పలు కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సున్నితమైన సమాచారం ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ చేతికి రావడం వెనుకున్న వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తున్నారు. బ్లూఫ్రాగ్‌ సంస్థతో ఐటీ గ్రిడ్స్‌ ఉన్న సంబంధం ఏమిటనే దానిపై కూడా దృష్టి సారించారు. బ్లూఫ్రాగ్‌ సంస్థకు తాళాలు ఎందుకు పడ్డాయనే దానిపై ఆరా తీస్తున్నారు. డేటా లీకేజీపై ఆయా అథారిటీలకు కూడా పోలీసులు లేఖలు రాయనున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. (అసత్య ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌!)

అశోక్‌ కోసం గాలింపు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్‌ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌ కోసం సైబరాబాద్‌ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల అశోక్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను పంపినట్టు తెలుస్తోంది. ఏపీ పోలీసుల కనుకసన్నల్లో అశోక్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. (డేటా చోర్‌.. బాబు సర్కార్‌)

ఎలాంటి సమాచారం లేదు: ఏపీ డీజీపీ
అమరావతి: ఐటి గ్రిడ్ డేటా చోరీ స్కామ్‌పై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. ఈ కేసులో తెలంగాణ పోలీసుల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదన్నారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు తమను కలవలేదని చెప్పారు. (‘చంద్రబాబు పరోక్షంగా నేరాన్ని అంగీకరించారు’)

Advertisement

తప్పక చదవండి

Advertisement