జీవో సాక్షిగా బాబు క్రెడిట్‌ చోరీ గుట్టు రట్టు..'ఔను.. అదానీనే'! | Chandrababu Govt Credit theft and Fake Campaign On Google data center | Sakshi
Sakshi News home page

జీవో సాక్షిగా బాబు క్రెడిట్‌ చోరీ గుట్టు రట్టు..'ఔను.. అదానీనే'!

Dec 4 2025 5:00 AM | Updated on Dec 4 2025 5:00 AM

Chandrababu Govt Credit theft and Fake Campaign On Google data center

విశాఖలో డేటా సెంటర్‌కు 480 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌ 11న చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీవో కాపీ. (ఇందులో ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం)

విశాఖకు గూగుల్‌ను తెచ్చాం.. గూగులే డేటా సెంటర్‌ నిర్మిస్తోందంటూ ఇన్నాళ్లూ మభ్యపుచ్చి ప్రచారం

అసలు డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది అదానీనే..  

డేటా సెంటర్‌కు కేటాయించిన 480 ఎకరాలు తిరిగి అదానీకి ఇస్తూ తాజాగా జీవో 

ఈ ఏడాది అక్టోబర్‌లో గూగుల్‌కు భూమి కేటాయిస్తున్నట్లు నమ్మిస్తూ జీవో జారీ 

రెండు నెలలు తిరగకుండానే అదానీకి బదలాయింపు.. 

బాబు క్రెడిట్‌ చోరీనా మజాకా..! అని నివ్వెరపోతున్న ప్రజలు 

వైఎస్‌ జగన్‌కు క్రెడిట్‌ రాకూడదని బాబు బృందం పన్నిన పన్నాగం గుట్టు రట్టు 

ఏడు కోట్ల మంది ప్రజల చెవిలో చంద్రబాబు పువ్వులు 

జగన్‌ తెచ్చిన అదానీ డేటా సెంటరే... గూగుల్‌ డేటా సెంటర్‌

బాబు క్రెడిట్‌ చోరీకి ఈ జీవోలే సాక్ష్యం

అక్టోబర్‌ 11న గూగుల్‌దేనని మభ్యపెట్టే ప్రయత్నం

డిసెంబర్‌ 2న అదానీదే అని బాబు గుట్టురట్టు  

రెండు నెలల క్రితం..
రూ.లక్ష కోట్లకుపైగా భారీ పెట్టుబడులతో విశాఖకు గూగుల్‌ వస్తోంది..! మేమే తీసుకొస్తున్నాం.. డేటా సెంటర్‌ ఏర్పాటు ఘనత మాదే!

రెండు రోజుల క్రితం..
అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్‌ ప్రాజెక్టు. గూగుల్‌కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాలను తిరిగి అదానీకి బదలాయిస్తున్నాం. గూగుల్‌కు ఇచ్చిన అన్ని రాయితీలను ప్రైమరీ నోటిఫైడ్‌ పార్టనర్‌ అదానీకి వర్తింప చేస్తున్నాం.
– గూగుల్‌ రాకపై చంద్రబాబు సర్కారు విన్యాసాలివీ!  
గూగుల్‌కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన జీవో   

సాక్షి, అమరావతి: గూగుల్‌ డేటా సెంటర్‌ క్రెడిట్‌ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన జిమ్మిక్కులు, సంకుచిత వైఖరి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వెలువరించిన జీవోల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి. విశాఖలో 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్‌ ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వమే జీవోలో వెల్లడించింది. అంతేకాదు... గతంలో గూగుల్‌కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని తిరిగి అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభు­త్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. 

విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి గూగుల్‌తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్‌ మొత్తం తన ఖాతాలో వేసుకోవ­డానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమైన విషయం తెలిసిందే. డేటా సెంటర్‌ ఏర్పాటుపై తొలుత ఈ ఏడాది అక్టోబర్‌లో ఆగమేఘాలపై జీవో ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. స్వయంగా గూగులే దీన్ని నిర్మిస్తోందని, ఈ ప్రాజెక్టు మొత్తం గూగుల్‌ సంస్థే ఇప్పటికిప్పుడు కొత్తగా చేపడుతోందనే భ్రమలు కల్పించింది. ఇక యథావిధిగా ఎల్లో మీడియా దీనికి కోరస్‌ పాడుతూ అదొక ప్రపంచ ఈవెంట్‌ మాదిరిగా చిత్రీకరించింది. 

టీడీపీ పెద్దల కనుసన్నల్లో రక్తి కట్టించిన ఈ నాటకం అంతా డ్రామా అని తాజాగా ప్రభుత్వ జీవోలే వెల్లడిస్తున్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అబద్ధాలు ఆడటం.. ఇంతటి ఘరానా మోసం.. ప్రజలకు ఎలా తప్పుడు సమాచారం ఇస్తు­న్నారో చెప్పేందుకు ఇదొక క్లాసిక్‌ కేస్‌ స్టడీగా రాజకీయ విశ్లేష­కులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా నిస్సిగ్గుగా అబద్ధాలాడతారనేందుకు విశాఖ డేటా సెంటర్లే నిదర్శనమని పేర్కొంటున్నారు. చంద్రబాబు బృందం క్రెడిట్‌ చోరీకి పాల్ప­డుతూ ఎంతటి అబద్ధాలైనా ఆడగలదని, ఆత్మసాక్షిని మోసగించి వంచనకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవు­తు­న్నాయి. 

నొయిడాలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం 4.64లక్షల చదరపు అడుగులను గూగుల్‌ అనుబంధ సంస్థ రైడాన్‌ ఇన్ఫోటెక్‌ లీజుకు తీసుకుందని 2022 అక్టోబర్‌ 11న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన కథనం ఇది. , గూగుల్‌తో కలిసి విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుండటం గర్వంగా ఉందని అదానీ గ్రూప్‌ అధినేత గౌతం అదానీ ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టు  

అదానీ.. గూగుల్‌ సంస్థ భాగస్వామే
విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌కు తొలుత అడవివరం–ముడసర్లోవ వద్ద 120 ఎకరాలు, ఆనందపురం మండలం తర్లువాడ వద్ద 200 ఎకరాలు, రాంబిల్లి వద్ద 160 ఎకరాలను గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌కు కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్‌ 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రెడిట్‌ చోరీలో భాగంగానే అదానీ పేరును దాచిపెట్టి కేవలం రైడెన్‌ టెక్‌ పేరుతో జీవో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో గూగుల్‌ అధికారిక భాగస్వామిగా అదానీ వ్యవహరిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదానీ గ్రూపును గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ వ్యాపార భాగస్వామిగా చంద్రబాబు సర్కారు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

ఆ భూములను అదానీకి బదలాయించండి..
ఏపీఐఐసీ కేటాయించిన ఆ 480 ఎకరాలను అదానీ గ్రూపు తదితర సంస్థల పేరిట బదలాయించాల్సిందిగా గూగుల్‌ కోరింది. తర్లువాడ, అడవివరం–ముడసర్లోవలో కేటాయించిన  భూములను అదాని పేరిట అంతర్గతంగా బదలాయించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ బదలాయింపు రైడెన్, అదానీ మధ్య అంతర్గత ఒప్పందం ద్వారా జరుగుతుందని వివరించింది. ప్రైమరీ నోటిఫైడ్‌ పార్టనర్‌గా ఉన్న అదానీకి గూగుల్‌కు ఇచ్చిన అన్ని రాయితీలను వర్తింప చేస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ఆ ఉత్తర్వుల్లో వెల్లడించడం గమనార్హం. 

సీఐఐ సదస్సు సాక్షిగా తేల్చి చెప్పిన అదానీ..
విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్‌ 14న ఢిలీల్లో ఎంవోయూ కుదుర్చుకున్న సమయంలో అదానీ పేరును చంద్రబాబు సర్కారు కనీసం ప్రస్తావించలేదు. దాదాపు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న అదానీ పేరు ఎక్కడా చెప్పకుండా చంద్రబాబు దాగుడుమూతలు ఆడారు. అయితే అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తాము ఆ డేటా సెంటర్‌లో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. 

గత నెలలో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ సందర్భంగా తాము గూగుల్‌తో కలసి 15 బిలియన్‌ డాలర్ల డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కరణ్‌ అదానీ స్వయంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.

ఆ డేటాసెంటర్‌.. జగన్‌ నాటిన మొక్క
సంకుచిత బుద్ధితోనే అదానీ పేరెత్తని బాబు
చంద్రబాబు సర్కారు క్రెడిట్‌ చోరీని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్‌ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కృషి, చొరవతో సాకారమైన డేటా సెంటర్‌ క్రెడిట్‌ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఏ విధంగా వేసుకున్నాడన్న విషయాన్ని వైఎస్‌ జగన్‌ సాక్ష్యాలతో ఎండగట్టారు. 

డేటా సెంటర్‌ ద్వారా విశాఖలో ఒక ఎకో సిస్టమ్‌ ఏర్పడుతుందని, తద్వారా గ్లోబల్‌ కేపబుల్‌ సెంటర్స్‌ వస్తాయన్నారు. డేటా సెంటర్‌ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్‌ సీ కేబుల్‌ సింగపూర్‌ నుంచి విశాఖకు ఏర్పాటు పనులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే అంకురార్పణ చేసింది. వైఎస్‌ జగన్‌ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన జీవో సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. తొలుత గూగుల్‌ పేరిట జీవో విడుదల చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఆ భూములను అదానీ పేరు మీదకు బదలాయించడమే దానికి తార్కాణం. 

కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు 2020 నవంబర్‌లో అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్‌కు డేటా రావాలంటే సింగపూర్‌ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాల్సి ఉన్నందున దీనిపై 2021 మార్చి 9న సింగపూర్‌ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి గూగుల్‌తో అదానీకి వ్యాపార అనుబంధం ఉంది. 

నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్‌ను గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ 2022 అక్టోబర్‌ 11 లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఆ డేటా సెంటర్‌ కోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్‌ను అసలు తాము నిర్మించడం లేదని, దీన్ని అదానీ గ్రూపే నిర్మిస్తుందని, ఆ భూమిని కూడా అదానీకే కేటాయించాలంటూ గూగుల్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ స్మిత్‌ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు అక్టోబర్‌లో లేఖ రాయడం గమనార్హం.  

చంద్రబాబును కలిసిన గౌతమ్‌ అదానీ

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement