ఆ దరఖాస్తులను ఏం చేద్దాం? | Completion of a program of free distribution of the revenue administration | Sakshi
Sakshi News home page

ఆ దరఖాస్తులను ఏం చేద్దాం?

Jun 10 2015 1:40 AM | Updated on Sep 3 2017 3:28 AM

క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఉచిత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న రెవెన్యూ యంత్రాంగం.. తాజాగా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులపై దృష్టి సారించింది.

సాక్షి, హైదరాబాద్ : క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఉచిత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న రెవెన్యూ యంత్రాంగం.. తాజాగా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులపై దృష్టి సారించింది. ఇప్పటికే చెల్లింపు కేటగిరీకి సంబంధించి 29,281దరఖాస్తులు సర్కారు వద్ద ఉండగా, తాజాగా మరిన్ని దరఖాస్తులు జతయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కేటగిరీలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న 3,36,869 మందిలో 16,915 మంది చెల్లింపు కేటగిరీ పరిధిలోకి వస్తారని అధికారులు తాజాగా నిర్థారించారు.

దీంతో  క్షేత్రస్థాయిలో పరిస్థితి గందరగోళంగా తయారైంది.  తమ ద రఖాస్తులను చెల్లింపు కేట గిరీలోకి మార్చడం పట్ల దరఖాస్తుదారులు రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారిన దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చేందుకు సర్కారు సన్నద్ధమైంది. జీవో నెంబరు 59 ప్రకారం నిర్ధేశితం సొమ్మును వెంటనే చెల్లించకుంటే.. ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు పంపాలని భావిస్తోంది.  

చెల్లింపు కేటగిరీలో స్థలం రిజిస్ట్రేషన్ ధరను చెల్లించేందుకు ప్రభుత్వం ఐదు సులభ వాయిదాల పద్ధతిని, ఒకేసారి చెల్లించే వారికి  ఐదు శాతం రాయితీ సదుపాయాన్ని కూడా కల్పించింది. అయితే.. చెల్లింపు కేటగిరీలో రెండు వాయిదాలను చెల్లించాల్సిన గడువు ఇప్పటికే పూర్తయింది. మూడో వాయిదా చెల్లించే సమయం (జూన్30) కూడా ఆసన్నమవుతున్న తరుణంలో.. ఉచితం నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారిన దరఖాస్తుదారులు మూడు వాయిదాల సొమ్మును ఒకేసారి చెలించాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు రూ.ల క్షలు చెల్లించమనడం ఎంతవరకు సబబని దరఖాస్తుదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఉచితంగా పట్టాలిస్తామంటే.. దరఖాస్తు చేసుకున్నాం గానీ, ఇప్పటికిప్పుడు సొమ్ములు చెల్లించమంటే ఎలాగని ఆగ్రహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు ఇస్తేమేలని అధికారులంటున్నారు. క్షేత్రస్థాయిలో వస్తున్న ఒత్తిడి మేరకు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీసీఎల్‌ఏ అధికారులు ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement