ముగ్గురికి సీఎం సర్వోన్నత పోలీసు పతకాలు
సేవా పతకాలను ప్రకటించిన హోంశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ‘తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకాల’ను ప్రకటించారు. దీంతోపాటు పోలీసు, ప్రత్యేక భద్రతా దళాలు, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి పోలీసు సేవా పతకాలను ప్రకటించారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్, ఏసీబీ కేంద్ర కార్యాలయం ఇన్స్పెక్టర్ జి.వెంకటేశం, ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్ పి.రాములు ‘తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకాల’కు ఎంపికయ్యారు.
ఇక శౌర్య పతకానికి 15 మంది, మహోన్నత సేవా పతకానికి 17 మంది, ఉత్తమ సేవా పతకానికి 95 మంది, కఠిన సేవా పతకానికి 53 మంది, సేవా పతకానికి 339 మందిని ఎంపిక చేశారు. ఇక ప్రత్యేక భద్రత విభాగంలో ఉత్తమ సేవా పతకానికి నలుగురు, సేవా పతకానికి 15 మంది.. అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవా పతకానికి ఒకరు, సేవా పతకానికి 14 మంది ఎంపికయ్యారు. నిఘా విభాగంలో మహోన్నత సేవా పతకానికి ముగ్గురిని, ఉత్తమ సేవా పతకానికి ఇద్దరిని, సేవా పతకానికి పది మందిని ఎంపిక చేశారు. ఏసీబీలో మహోన్నత సేవా పతకానికి ఒకరు, ఉత్తమ సేవా పతకానికి ఐదుగురు, సేవా పతకానికి 20 మంది ఎంపికయ్యారు.