‘అప్పులు చేసి..తప్పులు చెబుతున్నారు’
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విధానాల వల్ల దేశం మొత్తం నష్టపోతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం రాజ్భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయని..జీడీపీ 3 శాతానికి పడిపోయిందన్నారు. తెలంగాణలో కూడా ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని చెప్పారు. లక్షల కోట్లు అప్పులు చేసి.. లెక్కలు కూడా తప్పులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేయొద్దని గవర్నర్ను కలిసి వివరించామని వెల్లడించారు. దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు,రైతులు,ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని కాంగ్రెస్ ప్రశ్నించిందన్నారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్లు చేయించడం దారుణమన్నారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ఛలో ట్యాంక్బండ్ పిలుపుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, మేము కూడా పాల్గొంటామని భట్టి పేర్కొన్నారు.
ఆర్థికంగా మరింత వెనక్కినెట్టారు..
ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా బీజేపీ అమలు చేయలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా మండిపడ్డారు. నోట్ల రద్దు చేసి దేశాన్ని ఆర్థికంగా మరింత వెనక్కి నెట్టారని విమర్శించారు. నెహ్రు హయాంలో తీసుకొచ్చిన సంస్థల ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు. తెలంగాణ లో ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.... దేశంలో ఎయిర్ ఇండియా, బిఎస్ఎన్ఎల్, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రం ప్రైవేట్పరం చేస్తున్నారని.. ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.