తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించటాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించటాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఇది బీజేపీ కార్యాలయంపై దాడి చేయటమేనని పేర్కొంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే, అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థ చేత రాజకీయపార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయించటం తీవ్రమైన చర్య అని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపటానిన నిరసిస్తూ బుధవారం జరిగిన తెలంగాణ బంద్ విఫలమైందని ఆచారి అందులో పేర్కొన్నారు. ఇది ప్రజలు నిర్వహించిన బంద్ కాదని, ప్రభుత్వమే వెనుక ఉండి బంద్ నిర్వహించే ప్రయత్నం చేసిందని, అది కాస్తా విఫలం కావటంతో నిరాశనిస్పృహలతో బీజేపీ కార్యాలయంపై దాడికి ఉపక్రమించిందని ఆరోపించారు.