తుక్కుగూడలో కేకేకు ఓటు హక్కుపై రిట్‌

BJP Requests High Court To Cancel KK Vote - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కేకే) వేసిన ఓటు చెల్లదని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. రాజ్యసభ సభ్యుడిగా కేకేను.. ఏపీకి కేటాయించారని, ఆయన ఓటును రద్దు చేయాలని కోరుతూ బీజేపీకి చెందిన కౌన్సిలర్లు రిట్‌ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ఎన్నికల అధికారి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌ మధుమోహన్, వైస్‌ చైర్మన్‌ బి.వెంకట్‌రెడ్డిలను పేర్కొన్నారు.

కేకే ఓటు వేయడానికి అనుమతించిన ఎన్నికల అధికారి ఎస్‌.రాజేశ్వర్‌రెడ్డి అనుమతి ఇవ్వడాన్ని మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌ 5 (2), (3)కు వ్యతిరేకమని ప్రకటించాలని కోరతూ రాజుమోనిరాజు సహా ఎమిమిది మంది కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. మధుమోహన్, వెంకట్‌రెడ్డి.. చైర్మన్, వైస్‌ చైర్మన్లుగా ఎన్నిక అయ్యేందుకు ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా కేకే ఓటు కీలకమైందని, ఏపీకి చెందిన ఎంపీగా కేకే ఉన్నందున ఆయన తెలంగాణలోని మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఎన్నికల అధికారి అనుమతించడం చెల్లదని ప్రకటించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top