భద్రాచలంలో ఈసారి ఎవరు?

Who Get Blessings Of Bhadrachalam - Sakshi

భద్రాచలంలో కామ్రేడ్‌లకే ఎక్కువసార్లు పట్టం 

మన్యంలో జనం తీర్పు ఎంతో విలక్షణం

ఖ‍మ్మం,భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరొంది, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న భద్రాచలం, ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ.. అటు రాజకీయంగానూ విలక్షణ ప్రజాతీర్పుల కేంద్రంగాను గుర్తింపునొందింది. చుట్టూ అడవి నడుమ ఆదివాసీలు ఉన్న నియోజకవర్గం ఇది. ప్రధాన కేంద్రమైన భద్రాచలంలోనే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉంది. ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ అధికారుల పాలన సాగుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం కూడా  ఇక్కడే ఉండటంతో ..గెలిచే ఎమ్మెల్యేకు కూడా తగిన రీతిలోనే గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా సీపీఐ రెండుసార్లు, 4సార్లు కాంగ్రెస్‌ , 8సార్లు సీపీఎం అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం ఐదు మండలాలు మాత్రమే ఉన్నాయి. గతంలో ఎనిమిది మండలాలు ఉండగా రాష్ర్గ విభజన నేపథ్యంలో చింతూరు, వీఆర్‌.పురం, కూనవరం మండలాలను నియోజకవర్గం నుంచి వేరుచేసి..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లాయి. గతంతో పోలిస్తే ..ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఈ నియోజకవర్గం మూడు రాష్ట్రాలకు...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛతీస్‌గఢ్‌లకు సరిహద్ధుగా ఉంది. భద్రాచలంనకు ఆనుకునే ఏపీ సరిహద్దు(ఎటపాక) ఉండగా ,పట్టణంలో ఉన్న శివారు కాలనీలు కూడా ఏపీలోనే కలిశాయి. అదే విధంగా దుమ్ముగూడెంకు కూతవేటు దూరంలోనే ఛతీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దు ఉంది. ఈ కారణంగానే  ఇ​క్కడ మావోయిస్టుల పా​బల్యం ఎక్కువ.
 
మూడు ముక్కలు ..
భద్రాచలం: ఉమ్మడి రాష్ట్రంలో వైశాల్యం పరంగా అతిపెద్ద నియోజకవర్గమైన భధ్రాచలం ప్రస్తుత ఎన్నికలనాటికి మూడు ముక్కలైంది. 1952లో ఏర్పడి..అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉండేది. తొలినాళ్లలో జనరల్‌ స్థానంగా ఉన్న నియోజకవర్గం 1967 ఎన్నికల నాటికి ఎస్టీ రిజర్వ్‌గా మారింది. 1955లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా..సీపీఐకి చెందిన శ్యామల సీతారామయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు నిర్వహించగా ..సీపీఐ రెండు సార్లు ,4సార్లు కాంగ్రెస్‌, 8సార్లు సీపీఎంకు చెందిన అభ్యర్థులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజనకు ముందు 8మండలాలు, 2,11,437 మంది ఓటర్లు, 261 పోలింగ్‌ బూతులు ఉన్న భద్రాచలం నియోజకవర్గం ప్రస్తుత ఎన్నికల నాటికి మూడు ముక్కలైంది .

భద్రాచలం రూరల్‌, కూనవరం ,వీఆర్‌పురం,  చింతూరు మండలాలు నియోజకవర్గం నుంచి వేరై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ఱంలోని రంపచోడవరం నియోజకవర్గంలో విలీనమయ్యాయి. భద్రాచలం టౌన్‌(భద్రాచలం రెవెన్యూ గ్రామం ఒక్కటే), దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో అక్టోబర్‌ 12వ తేదీన ప్రకటించిన జాబితా మేరకు 1,33,764 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు ఉన్నప్పటికీ, జిల్లాల విభజనతో వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాలపల్లి జిల్లాలోకలిపారు. ఈ కారణంగా ఆ మండలాలకు భద్రాచలం ఎమ్మెల్యేనే అయినప్పటికీ ,పాలన మాత్రం భూపాలపల్లి జిల్లా నుంచి సాగుతోంది.

సీపీఎంకు కంచుకోట ..
భద్రాచలం నియోజకవర్గాన్ని సీపీఎంకు కంచుకోటగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఆ పార్టీ 8సార్లు గెలుపొందింది. ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, కుంజాబొజ్జి మూడుసార్లు వరుసగా విజయం సాధించారు. అతిసాధారణ జీవితంతో బొజ్జి నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలిచారు. వరుసగా మూడుసార్లు గెలిచి..ఆదివాసీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఆయన ..ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టిన నేతగా గర్తింపుపొందారు. నేటికీ.. సొంతిల్లు కూడా లేక..సాధారణ జీవితాన్ని గడుపుతూ... నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ ..మన్ననలు అందుకుంటున్నారు. ఇక తాజా మాజీ ఎమ్యెల్యే సున్నం రాజయ్య కూడా మూడుసార్లు  గెలిచారు.

అయితే 2009లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కుంజా సత్యవతి చేతిలో ఓడిపోయారు. మళ్లీ కంచుకోటలో పాగా వేసేందుకు సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలిచారు. ఈసారి రాజయ్య తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి పోటీ చేయను​న్నారు. ఆయన సొంత మండలం ...వీఆర్‌పురం ఏపీలో కలవడంతో అటు వెళుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top