
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 17 జిల్లాలకు కొత్త అదనపు కలెక్టర్లను (స్థానిక సంస్థలు) నియమించింది. ఇందులో 8 మంది ఐఏఎస్, 9 మంది నాన్ ఐఏఎస్ అధికారులున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 29 జిల్లాలకు అదనపు కలెక్టర్లను (స్థానిక సంస్థ) నియమించినట్టు అయింది.
ఐఏఎస్ అధికారులు అనుదీప్ దురుశెట్టి (భద్రాద్రి కొత్తగూడెం), కోయ శ్రీహర్ష (జోగుళాంబ గద్వాల), అభిలాష అభినవ్ (మహబూబాబాద్), బి.సత్యప్రసాద్ (రాజన్న– సిరిసిల్ల), కుమార్ దీపక్ (పెద్దపల్లి), ఆదర్శ్ సౌరభి (ములుగు), భోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు (నిర్మల్), తేజస్ నంద్లాల్ పవార్ (మహబూబ్నగర్) అదనపు కలెక్టర్లుగా నియమితులయ్యారు. నాన్ ఐఏఎస్ అధికారులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కోట శ్రీవాత్సవ (వనపర్తి), జాల్దా అరుణశ్రీ (జగిత్యాల), అనుగు నర్సింహారెడ్డి (కరీంనగర్), కందూరి చంద్రారెడ్డి (నారాయణపేట), ఎన్.నటరాజ్ (కుమ్రంభీం–ఆసిఫాబాద్), వైవీ గణేష్ (జయశంకర్ భూపాలపల్లి), బి.వెంకటేశ్వర్లు (మెదక్), జి.పద్మజారాణి (సూర్యాపేట), డి.శ్రీనివాస్రెడ్డి (యాదాద్రి–భువనగిరి)లను అదనపు కలెక్టర్లుగా నియమించారు. యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ జి.రమేశ్ను అక్కడి నుంచి బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.