
సాక్షి, హైదరాబాద్ : ఓ తెలుగు దినపత్రికలో ‘దొరికినా.. దొరేనా? సీఎం కేసీఆర్కు ఏసీబీ డీజీ సంచలన లేఖ’ అంటూ వచ్చిన వార్తను ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తాను సీఎంవోకు, సీఎస్కు లేఖ రాశాననేది పూర్తిగా అవాస్తవమని, ఆ వార్త తనను చాలా బాధకు గురి చేసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘మీడియా, దినపత్రికలు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లే ఏసీబీ కూడా పని చేస్తుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ‘దొరికినా దొరేనా’ అనే శీర్షికతో రాసిన వార్త ఏ విధంగా ప్రచురించారని ప్రశ్నిస్తున్నా.
నేను సీఎంవోకు, సీఎస్కు లేఖ రాయలేదు. పత్రికలో మొదటి పేజీలో వార్త రాసేటప్పుడు ఏ విధమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని అడుగుతున్నా. తప్పుడు వార్తపై ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఊహాజనిత వార్తల వల్ల సంబంధిత శాఖపై సమాజంలో ఉన్న మంచిపేరు పోతుంది. మేము మనుషులమే, మాకు మనసు ఉంటుంది. తప్పుడు వార్తలతో నిందలు వేయడం వల్ల ఇబ్బందులు పడతామనేది గ్రహించారు. ఈ వ్యవహారంపై పత్రిక యాజమాన్యం సంజాయిషీ ఇవ్వాలి. లేకుంటే చట్టపరంగా ముందుకు వెళతాం.’ అని స్పష్టం చేశారు.