పత్తి కొనుగోలుకు 200 కేంద్రాలు | 200 centers for cotton purchase centers | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోలుకు 200 కేంద్రాలు

Oct 28 2017 2:14 AM | Updated on Oct 1 2018 2:16 PM

200 centers for cotton purchase centers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు 200 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసు కోవాలని ఆయన జాయింట్‌ కలెక్టర్లను ఆదే శించారు. ఇకపై ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు సమీ పంలో ఉండే విధంగా వికేంద్రీకరించాలన్నారు. పత్తి, వరిధాన్యం, మొక్కజొన్న, సోయా బీన్‌ తదితర పంటల దిగుబడి, మార్కెట్లో ధర వంటి అంశాలపై శుక్రవారం ఆయన అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతగల పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,320 కన్నా ఎక్కువుందన్నారు. అయితే పత్తికి ధర రావడం లేదన్న వార్తలు వస్తున్నాయన్నారు. పత్తి మార్కెటింగ్‌ సీజన్‌ ముగిసే వరకు జాయింట్‌ కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. 

తేమ శాతంపై అవగాహన.. 
పత్తి తేమ శాతం 12 లోపే ఉండేలా రైతుల్లో అవగాహన పెంచాలని మంత్రి హరీశ్‌ అన్నారు. జిన్నింగ్‌ మిల్లుల దగ్గర రైతులపై అదనపు చార్జీల భారం వేయకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ఫోన్‌ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. రైతు సమన్వయ సమితులు, స్థానిక వ్యవసాయ అధికారులను భాగస్వాములు చేసి రైతు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.  

72 గంటల్లోపు ఖాతాలోకి డబ్బులు.. 
అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, ఎంపీలతో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్‌ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. పత్తి అమ్మిన వెంటనే 48 నుంచి 72 గంటలలోపు రైతుల ఖాతాలోకి నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలు వారంలో ఆరు రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు.  జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న జిన్నింగ్‌ మిల్లుల అగ్రిమెంట్లను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని వరంగల్‌ సీసీఐ బ్రాంచి మేనేజర్‌ సిన్హాను ఆదేశించారు. కొన్ని చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవడంలో జాప్యం జరుగుతోందని, వాటి వేగం పెంచాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement