అవయవదానం చేయడం ద్వారా పునర్జన్మను ప్రసాదించిన దయార్ద్ర హృదయులు రాష్ట్రంలో
చెన్నై, సాక్షి ప్రతినిధి: అవయవదానం చేయడం ద్వారా పునర్జన్మను ప్రసాదించిన దయార్ద్ర హృదయులు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. గత ఆరేళ్లలో బ్రెయిన్డెడ్కు గురైన 620 మంది తమ అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి ప్రాణం పోసిన ఘనతను చాటుకున్నారు. 2008లో తిరుక్రున్రంకు చెందిన హితేంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్డెడ్ స్థితికి వెళ్లా డు. అతని అవయవాలను దానం చేసేం దుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. హితేంద్రన్ గుండె 9 ఏళ్ల చిన్నారికి అమర్చారు. ఈ సంఘటన తమిళనాడులో అవయవదానంపై చైతన్యాన్ని రగిల్చింది. ఈ సంఘటన తరువాతనే ఆవయవదాన పథకం అదే ఏడాది అక్టోబరులో అవిర్భవించింది.
చెన్నై రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదానికి గురైనా వారి కళ్లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు వంటివి దానం చేయడంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో అవయవదానాలు చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అవయవదానంలో దేశంలోనే తమిళనాడు ప్రథమస్థానంలో నిలిచినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 2008 అక్టోబరు నుంచి గత ఏడాది మార్చి 31వ తేదీ వరకు అంటే ఈ 78 నెలల్లో 620 మంది అవయవదానం చేసి రికార్డు సృష్టించారు. వారి నుంచి 125 మంది గుండె, 60 మంది ఊపిరితిత్తులు, 573 మంది కాలేయం,1113 మంది మూత్రపిండాలు, నలుగురు ప్యాంక్రియాస్, ఇద్దరు చిన్నప్రేవులు, 590 మంది హృదయకవాటాలు, 938 మంది నేత్రాలు, ఒక రక్తకుళాయి, 13 మంది చర్మాన్ని మొత్తం 3,464 మందికి అమర్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించారు.