ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయటంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. యార్డులో విధ్వంసం సృష్టించారు. వివరాలివీ.. యీనాం విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఉదయం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. అప్పటికే వందలాది మంది రైతులు, పత్తి వాహనాల రాకతో యార్డు నిండిపోయింది. ఈ సమయంలో వ్యాపారులు ససేమిరా అనటం రైతులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.వెంటనే వారు అధికారుల కార్యాలయంతోపాటు యార్డులోని కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మార్కెట్ యార్డులో వందలాది మంది రైతులు ధర్నాకు దిగారు. వెంటనే కొనుగోళ్లు మొదలుపెట్టాలని నినాదాలు చేశారు. వారి ఆందోళనతో ఆ ప్రాంతంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.