రూ.500 నోట్లు వచ్చాయోచ్‌! | Rs 320 crore worth new 500 Rupees notes arrive in Chennai | Sakshi
Sakshi News home page

రూ.500 నోట్లు వచ్చాయోచ్‌!

Dec 4 2016 11:17 AM | Updated on Sep 4 2017 9:54 PM

చిల్లర నాణేలను తరలిస్తూ...

చిల్లర నాణేలను తరలిస్తూ...

చిలర్ల కష్టాలు కొంతైనా తీరేనా..! అన్న ఎదురు చూపులు తమిళనాడు రాష్ట్రంలో పెరిగాయి.

చెన్నైకు విమానంలో  రూ. 320 కోట్లు
చిల్లర  నాణేలు కూడా
కష్టం కొంతైనా తీరేనా?


సాక్షి, చెన్నై: చిలర్ల కష్టాలు కొంతైనా తీరేనా..! అన్న ఎదురు చూపులు తమిళనాడు రాష్ట్రంలో పెరిగాయి. ఇందుకు తగ్గట్టుగా శనివారం చెన్నైకు విమానంలో రూ. 500 కొత్త నోట్ల రూ. 320 కోట్ల మేరకు వచ్చి చేరాయి. అలాగే, సేలంకు రూ. కోటి విలువగల రూ.5, రూ.10 నాణేలు వచ్చాయి. రాష్ట్రంలో ఒకటో తేదీ నుంచి చిల్లర సమస్య మరింత జఠిలంగా మారిన విషయం తెలిసిందే. ఏటీఎంలకు వెళ్లినా, బ్యాంకులకు వెళ్లినా రూ. 2వేల నోట్లే ఇస్తుండడంతో చిల్లర సమస్య మరింతగా పెరిగింది.

ఏ షాపునకు వెళ్లినా చిల్లర దొరకని దృష్ట్యా, జనం పాట్లు అంతా, ఇంతా కాదు. ఈ కొరతను అధిగమించేందుకు రూ. ఐదు వందల నోట్లు ఎప్పుడెప్పుడు వస్తాయో అని ఎదురు చూపుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాసిక్‌ నుంచి విమానంలో చెన్నైకు ఐదు వందల నోట్లు వచ్చి చేరాయి. ఉదయాన్నే మీనంబాక్కం విమానాశ్రయం కార్గోకు ఈ నోట్లు చేరుకున్నాయి. రిజర్వు బ్యాంక్‌ వర్గాలు, పోలీసు యంత్రాంగం నిఘా నడుమ నాలుగు కంటైనర్లలోకి నోట్ల కట్టలతో ఉన్న బాక్సుల్ని చేర్చారు. అక్కడి నుంచి గట్టి భద్రత నడుమ రిజర్వు బ్యాంక్‌ కార్యాలయానికి తరలించారు. అన్ని ఏటీఎంలలో పొందు పరిచేందుకు, బ్యాంకుల్లో పంపిణీ నిమిత్తం తరలించేందుకు రిజర్వు బ్యాంక్‌ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం రూ. ఐదు వందల కొత్త నోట్లు జనం చేతికి చేరే అవకాశాలు ఉన్నాయి.

సేలంకు రూ. కోటి విలువగల రూ. ఐదు, రూ.పది నాణేలను తరలించారు. అక్కడి బ్యాంక్‌లకు ఈ చిల్లరను  గట్టి భద్రత నడుమ చేర్చారు. రిజర్వు బ్యాంక్‌ నిబంధనల్ని ఉల్లంఘించి బ్యాంకులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు బయలు దేరాయి. గృహ, వాహన రుణాలను ముక్కు పిండి మరీ వసూళ్లు చేసే పనిలో పడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, శనివారం కూడా బ్యాంక్‌ల వద్ద, ఏటీఎంల వద్ద జనం బారులు తీరక తప్పలేదు. పలు చోట్ల బ్యాంకుల వద్ద ఆందోళనలు సాగాయి. మన్నార్‌ కుడికి చెందిన రైతు అశోకన్‌(55) బ్యాంకు కూలీ. నిలబడి నిరసించి స్పృహ తప్పాడు. ఆసుపత్రికి తరలించగా, మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement