నేను రనౌట్‌ అయ్యా.. | pradeep chandra interesting comments | Sakshi
Sakshi News home page

నేను రనౌట్‌ అయ్యా..

Jan 5 2017 8:35 AM | Updated on Oct 1 2018 6:25 PM

నేను రనౌట్‌ అయ్యా.. - Sakshi

నేను రనౌట్‌ అయ్యా..

‘అందరూ క్రికెట్‌ గురించి మాట్లాడారు. నేను వన్డౌన్ లో బ్యాటింగ్‌కు వచ్చానని సీఎం అన్నారు. దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యా. కొన్నిసార్లు ఇలా జరుగు తుంది.

► వీడ్కోలు కార్యక్రమంలో మాజీ సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర సంచలన వ్యాఖ్యలు
►షెడ్యూల్డ్‌ కులాల వారికి గుర్తింపు రాదన్న అపవాదు రాకుండా చూడండి
►అలా అయితే యువ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్య
►ఆయన సేవలను సీఎం వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం: మంత్రులు


సాక్షి, హైదరాబాద్‌: ‘అందరూ క్రికెట్‌ గురించి మాట్లాడారు. నేను వన్డౌన్ లో బ్యాటింగ్‌కు వచ్చానని సీఎం అన్నారు. దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యా. కొన్నిసార్లు ఇలా జరుగు తుంది. ఇందులో మీ తప్పేం ఉండదు. ఒక్కో సారి ముందుకెళ్లిన తర్వాత వెనక్కి మళ్లీ చూడ టం కుదరదు. ఈ పరిస్థితుల నుంచి రాజకీయ ప్రతిఫ లం ఆశిస్తున్న వారూ ఉన్నారు. ప్రభుత్వం వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజాయతీ, చిత్తశుద్ధి, అర్హత గల వారికి గుర్తింపు, గౌరవం లభించదన్న సందేశం వెళ్లకుండా చూడండి. మంచి పనిమంతు లైనప్పటికీ ఎస్సీలకు గుర్తింపు లభించదన్న అపవాదు రాకుండా చూడండి. ఈ అపవాదు యువ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయ గలదు. దీనిపై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి. ప్రభుత్వానికి వినమ్రతతో చేస్తున్న విజ్ఞప్తి ఇది.’ అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత నవంబర్‌ 30న రాష్ట్ర రెండో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్‌చంద్ర నెల రోజులే పదవిలో కొనసాగారు. పదవీ కాలం పొడిగింపునకు కేంద్రం అంగీకరించకపోవడంతో ప్రదీప్‌ చంద్ర డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుధవారం సచివాలయంలో ప్రదీప్‌చంద్రను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్‌ సమక్షంలోనే పై వాఖ్యలు చేశారు. కాగా, ప్రదీప్‌ చంద్ర సేవలను వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టీఎస్‌–ఐపాస్‌ రూపకల్పనలో ప్రదీప్‌ చంద్ర బృందం ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు.

ఏ సమస్య తోనైనా ప్రదీప్‌చంద్రను సంప్రదిస్తే సానుకూల దృక్పథంతో చక్కటి పరిష్కారం చూపేవారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొనియా డారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్‌ ఎస్పీ సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సలహాదారులు ఏకే గోయల్, రాంలక్ష్మణ్, పాపారావు, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌ రావు, ప్రజా గాయకుడు గద్దర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement