ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం | People Paniced To Touch Currency Notes In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం

May 5 2020 7:04 AM | Updated on May 5 2020 7:09 AM

People Paniced  To Touch Currency Notes In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై : చెన్నై పురసైవాక్కం, వెస్ట్‌ మాంబళం, మాధవరం తదితర ప్రాంతాల్లో రాత్రివేళల్లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు విసిరేయడంపై కరోనా వైరస్‌ వ్యాప్తికి కుట్ర ఏదైనా జరుగుతుందా అనే అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. చెన్నై మాధవరం పాలకొట్టం సమీపం కేకే తాళై మాణిక్యం వీధిలో ఈనెల 2వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సైకిళ్లపై సంచరించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు కట్టుదిట్టంగా అమల్లో ఉన్న ఆ పరిసరాల్లోని ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 కరెన్సీ నోట్లను చల్లిపోయారు. వీరి చేష్టలు అనుమానంగా ఉండడంతో స్థానికులు వారిని పట్టుకునేందుకు యత్నించగా పారిపోయారు. వారంతా ఇళ్ల ముందు కరెన్సీ నోట్లను ఎందుకు చల్లిపోతున్నారో ఎవ్వరికీ అంతుబట్టలేదు. కరోనా వైరస్‌ భయంతో ఉన్న ప్రజలు ఎవ్వరూ ఆ నోట్లను తాకలేదు.

కాగా స్థానిక మహిళ ఇదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఆ నోట్లను ఎవ్వరూ తాకవద్దు, వైరస్‌ సోకే ప్రమాదం ఉంది, సైకిల్‌పై సంచరిస్తూ కరెన్సీ నోట్లను వెదజల్లుతున్న గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె కోరింది. ఈ పోస్టింగ్‌ పోలీసులకు చేరడంతో తాళై మాణిక్యం వీధిలోని సీసీటీవీ కెమెరాల పుటేజీ సహాయంతో వారికోసం గాలిస్తున్నారు. అలాగే చెన్నై పురుసైవాక్కం, వెస్ట్‌ మాంబళంలో సైతం ఇళ్ల ముందు కరెన్సీనోట్ల∙సంఘటనలు చోటుచేసుకున్నాయి. సామాజిక కార్యకర్తలు కొందరు ఈ ఘటనలపై స్పందిస్తూ,  ఇళ్లలో దొంగతనాలు చేసేందుకు డబ్బులు ఎరగా వేసి ఉంటారా అనే కోణంలో మాత్రమే పోలీసులు విచారిస్తున్నారని అన్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ ప్రబలుతున్నట్లు ఇంతవరకు నిర్ధారణ కాకున్నా అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. వైరస్‌వ్యాప్తి కోసం కరెన్సీ నోట్లను చల్లుతున్నారనే భీతి ప్రజల్లో నెలకొని ఉన్నందున సదరు ముఠాను పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టాలని ఆయన కోరారు.   

Advertisement
 
Advertisement
Advertisement