పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం | Nirvana pending projects | Sakshi
Sakshi News home page

పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం

Aug 26 2013 2:35 AM | Updated on Sep 1 2017 10:07 PM

రాష్ట్రంలో మరుగున పడిన అన్ని సాగునీటి పథకాలను తన అధికార వ్యవధిలో పూర్తి చేస్తామని, ఇందుకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.

లింగసూగూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో మరుగున పడిన అన్ని సాగునీటి పథకాలను తన అధికార వ్యవధిలో పూర్తి చేస్తామని, ఇందుకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఆదివారం ఆయన తాలూకాలోని మస్కి గ్రామంలో  వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని వూట్లాడారు. ప్రస్తుత బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.9,813 కోట్లు మంజూరు చేశామన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో కృష్ణా, కావేరి, గోదావరి బేసిన్లపరిధిలో అన్ని సాగునీటి పథకాల పనులను అమలు చేయడం ద్వారా రైతులు సమృద్ధిగా పంటలు పండించేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని ఆకలి రహిత రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశంతో అన్న భాగ్య పథకాన్ని ప్రారంభించామన్నారు.
 
ఇప్పటికే రాష్ట్రంలో 98.36 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, అదే విధంగా క్షీరభాగ్య పథకం అమలు చేస్తున్నామన్నారు. సింధనూరు- లింగసూగూరు రాష్ట్ర రహదారి నిర్మాణానికి గతంలో టెండర్ ప్రక్రియకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నేరుగా ప్రభుత్వం ద్వారానే ఈ రహదారి పనులను చేపట్టనుందని తెలిపారు. ఈ సందర్భంగా మస్కి ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్ మాట్లాడారు.
 
కార్యక్రమంలో మంత్రులు ెహ చ్‌సీ.మహదేవప్ప, శివరాజ్‌తంగడగి, కాంగ్రెస్ జిల్లాధ్యక్షులు ఏ.వసంతకుమార్, ఎమ్మెల్యేలు హంపనగౌడ బాదర్లి, హంపయ్య నాయక్, నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement