ఫేస్‌బుక్ రాసింది.. పెళ్లి పుస్తకం | facebook love and then savitri and naveen become couple | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ రాసింది.. పెళ్లి పుస్తకం

Mar 5 2017 8:49 PM | Updated on Jul 26 2018 5:23 PM

పెళ్లిపీటలపై నవీన్, సావిత్రి - Sakshi

పెళ్లిపీటలపై నవీన్, సావిత్రి

ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని ప్రేమ బాసలు చెప్పుకున్నారు.

రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ...
నువు రాయివి కావూ గంగవు కావూ
నే రాముడు శివుడూ కానే కానూ
తోడనుకో నీవాడనుకో..

అని ఇరువురు బంధం కలుపుకున్నారు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని ప్రేమ బాసలు చెప్పుకున్నారు. దివ్యాంగురాలని తెలిసీ మనసిచ్చాడు. మనువాడాడు. గొప్ప మనసు చాటుకున్నాడు. అతను చూపించిన ప్రేమను పదిలంగా కాపాడుకుంటానని, భర్తను కంటికి రెప్పలా చూసుకుంటానని ఆ దివ్యాంగురాలు వేదమంత్రాల సాక్షిగా శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేసి ఏడడుగులు నడిచింది. వీరిద్దర్ని కలిపింది కుటుంబ పెద్దలు కాదు. సామాజిక మాధ్యమ రారాజు ఫేసుబుక్‌. శనివారం వారిద్దరూ సింహాచలం పుష్కరిణి సత్రంలో ఒకటయ్యారు. వీరి ప్రేమ, పెళ్లి కథేంటో చూద్దాం..
– సింహాచలం

పేస్‌బుక్‌లో పరిచయమైన సావిత్రి
దివ్యాంగురాలిని పెళ్లి చేసుకున్న
ఆదర్శ యువకుడు నవీన్‌


సుమారు 22ఏళ్ల క్రితం మూడునెలల పసిగొడ్డుగా ఉన్న సావిత్రి (పెళ్లికూతురు)ని నగరంలోని రాణీచంద్రమాదేవి హాస్పటల్‌కు చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన తల్లిదండ్రులు పోలియో అని తెలిసి అక్కడే వదిలివెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రి నర్సులు, ఇతర సిబ్బంది సావిత్రిని చేరదీసి పదేళ్ల వరకూ పెంచారు. యుక్తవయçస్సు వస్తుండటంతో అక్కడి నుంచి శ్రీకాకుళంలోని బేబీ హోమ్‌కు పంపించారు. అక్కడే సావిత్రి పదో తరగతి వరకూ చదివింది. పదోతరగతి అనంతరం సావిత్రిని విశాఖలోని ఏయూలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ కె.పి.సుబ్బారావు, ఆమె భార్య డి.లలిత(స్త్రీ శక్తి మహిళా సంఘ సభ్యురాలు) దత్తత తీసుకుని పీజీ వరకు చదివించారు.

ఎమ్‌.ఎ. ఎకనామిక్స్‌లో 84శాతం ఉత్తీర్ణతను సావిత్రి సాధించింది. ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోంది.  2016లో విశాఖలోని గాజువాకదరి నడుపూరులో తాపీమేస్త్రీగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్‌ ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. నవీన్‌కు కూడా నా అనేవాళ్లు ఎవరూ లేరు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాను దివ్యాంగురాలునని పరిచయం అయిన కొన్ని రోజులకు సావిత్రి నవీన్‌కి చెప్పింది. సావిత్రిని చూడటానికి వచ్చిన నవీన్‌ తాను పెళ్లిచేసుకుంటానని చెప్పాడు. దీంతో దత్తత తీసుకున్న సుబ్బారావు, లలిత, పలువురు మహిళామండలి సభ్యులు వీరిద్ధరికీ శనివారం వివాహం జరిపించారు.

వివాహం జరిపించిన వారితో నవీన్, సావిత్రి

Advertisement
 
Advertisement
Advertisement