ఇద్దరు బీఎంటీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఒక బీఎంటీసీ డ్రైవర్ బ్రేక్ డౌన్ అయిన బస్సును నిర్లక్ష్యంగా...
సాక్షి, బెంగళూరు: ఇద్దరు బీఎంటీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఒక బీఎంటీసీ డ్రైవర్ బ్రేక్ డౌన్ అయిన బస్సును నిర్లక్ష్యంగా రోడ్డుపై పార్క్ చేస్తే, మరో బీఎంటీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా బస్సును నడుపుతూ ఓ టెక్కీ మృతికి కారణమయ్యారు. వివరాలు....రామమూర్తి నగర్లో నివసించే ఎం.శ్రీనివాసులు బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. బీఎంటీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి వెంకట్ చెబుతున్నారు.
ఆ వివరాలు ఆయన మాటల్లో ....‘మారతహళ్లిలోని ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్’ వద్ద ఉన్న రోడ్డు పై ఓ బీఎంటీసీ బస్సు బ్రేక్ డౌన్ అయి నిలబడి ఉంది. అదే దారిలో వస్తున్న శ్రీనివాసులు టర్న్ తీసుకొని వెళ్లేందుకు బ్రేక్ డౌన్ అయిన బస్సు వెనకాల తన బైక్ నిలబెట్టారు. ఇంతలోనే వెనుకగా మరో బీఎంటీసీ బస్సు వేగంగా వచ్చి శ్రీనివాసులను ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాసులు రెండు బస్సుల మధ్య ఇరుక్కొని గాయపడ్డారు.
శ్రీనివాసులను బయటికి తీసుకువచ్చేందుకు 20 నిమిషాల సమయం పట్టిం ది. అక్కడి నుంచి ఎంతో మంది వెళుతున్నప్పటికీ సహాయం చేసేందుకు ముం దుకు రాలేదు. ఆ సమయంలో ఓ ఉద్యోగిని ముందుకొచ్చి బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంలో సహాయం చేశారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు’ అని చెప్పారు.
ఇక ఈ ఘటనకు కారణమైన బీఎంటీసీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డ్రైవర్లకు శిక్ష పడేవరకు న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు. శ్రీనివాసులకు భార్య, ఎనిమిదేళ్లు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని వారికి నష్టపరిహారాన్ని సైతం బీఎంటీసీ చెల్లించాలని కోరుతున్నారు.