వాట్సన్‌ విజృంభణ

Watson ton powers CSK to 204 - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో రెండో సెంచరీ నమోదైంది.  నిన్నటి ఆటలో క్రిస్‌ గేల్‌ సెంచరీతో చెలరేగిపోతే, ఈ రోజు ఆటలో షేన్‌ వాట్సన్‌ సెంచరీ(106; 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు)తో విజృంభించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు వాట్సన్‌ శతకంతో విరుచుకుపడ్డాడు. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిన వాట్సన్‌ రాయల్స్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఓపెనర్‌గా దిగిన వాట్సన్‌కు ఆరంభంలోనే రెండు లైఫ్‌లు లభించడంతో దాన్ని సద్వినియోగం చేసుకుని రాయల్స్‌కు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వాట్సన్‌ దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సురేశ్‌ రైనా(46;29  బంతుల్లో 9ఫోర్లు), డ్వేన్‌ బ్రేవో(24 నాటౌట్‌;16 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో చెన్నై ఇన్నింగ్స్‌ను అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌లు ఆరంభించారు. జట్టు 50 పరుగుల వద్ద రాయుడు(12) ఔట్‌ కాగా, షేన్‌ వాట్సన్‌ మాత్రం రెచ్చిపోయాడు. సురేశ్‌ రైనా(46)తో కలిసి రెండో వికెట్‌కు 81 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే వాట్సన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. వీరిద్దరూ చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో చెన్నై 10 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే రైనా తర్వాత వాట్సన్‌ తన దూకుడును కొనసాగించడంతో చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌గా వచ్చిన వాట్సన్‌ ఇన్నింగ్స్‌లో ఇంకా  బంతి ఉండగా మాత్రమే ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top