అందుకు మేము అర్హులం కాదు : కోహ్లి | Sakshi
Sakshi News home page

అందుకు మేము అర్హులం కాదు : కోహ్లి

Published Mon, Apr 30 2018 9:58 AM

Virat Kohli Says We Dont Deserve To Win If We Field Like That - Sakshi

బెంగళూరు : కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగేనని అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రతీ మ్యాచ్‌ నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనుకున్న దాని కన్నా మంచి స్కోర్‌ సాధిస్తున్నాం. కానీ ఓటమి తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లో వికెట్లు కోల్పోతున్న తరుణంలో 165 పరుగులు చేసినా ఎక్కువే అనుకున్నాం. కానీ అదనంగా పది పరుగులు లభించాయి. మంచి స్కోర్‌ సాధించినప్పటికీ మ్యాచ్‌ కాపాడుకోలేకపోయామని’  కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మా ఫీల్డింగ్‌ సరిగా లేదు. సింగిల్స్‌ను బౌండరీలుగా మార్చడాన్ని ఆపలేకపోయాం. ఇలా అయితే విజయానికి మేము అర్హులం కాదు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో మరింత శ్రమించాల్సి ఉందని’  ఆర్సీబీ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు.

ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అయితే రెండు వరుస ఓటములతో డీలా పడ్డ కోల్‌కతాకు ఈ మ్యాచ్‌లో అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు క్రిస్‌ లిన్, నరైన్‌ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగడంతో పవర్‌ప్లేలో 51 పరుగులు వచ్చాయి. లిన్‌ 7 పరుగుల వద్ద ఉన్నపుడు అతను ఇచ్చిన క్యాచ్‌ను మురుగన్‌ అశ్విన్‌ వదిలేశాడు. తనకు లభించిన లైఫ్‌ను చక్కగా వినియోగించుకున్న లిన్‌.. ఆర్సీబీ ఓటమిని శాసించాడు.

Advertisement
Advertisement