సెమీస్‌లో తీర్థ | Thiruda reached in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తీర్థ

Oct 18 2013 1:31 AM | Updated on Sep 1 2017 11:44 PM

తన విజయపరంపరను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇస్కా తీర్థ జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

న్యూఢిల్లీ: తన విజయపరంపరను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇస్కా తీర్థ జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీర్థ 6-7 (3/7), 6-2, 7-6 (7/2)తో సృష్టి సలారియా (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన తీర్థ రెండో సెట్‌ను అలవోకగా చేజిక్కించుకుంది.
 
  నిర్ణాయక మూడో సెట్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడటంతో టైబ్రేక్ అనివార్యమైంది. కీలకమైన టైబ్రేక్‌లో తీర్థ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో చామర్తి సాయి సంహిత (తమిళనాడు)తో తీర్థ పోటీపడుతుంది. మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మహిత దాడిరెడ్డి (ఆంధ్రప్రదేశ్) 6-7 (6/8), 1-6తో శ్వేతా రాణా (ఢిల్లీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ విఘ్నేశ్ (ఆంధ్రప్రదేశ్) 2-6, 1-6తో అర్జున్ ఖాడే (మహారాష్ట్ర) చేతిలో ఓటమి పాలయ్యాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement