నరైన్, పొలార్డ్‌లకు పిలుపు

Sunil Narine And Pollard Selected For West Indies T20 Team - Sakshi

భారత్‌తో టి20 సిరీస్‌కు విండీస్‌ జట్టు ప్రకటన  

సెయింట్‌జాన్స్‌: చాలాకాలం తర్వాత ‘మిస్టరీ స్పిన్నర్‌’ సునీల్‌ నరైన్‌ వెస్టిండీస్‌ టి20 జట్టుకు ఎంపికయ్యాడు. భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు గాను తొలి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ప్రకటించిన జట్టులో అతడితో పాటు ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌కు చోటుదక్కింది. నరైన్‌ విండీస్‌ తరఫున రెండేళ్ల క్రితం చివరి టి20 ఆడాడు. మొత్తం 14 మంది సభ్యుల జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఆంథోని బ్రాంబెల్‌ ఒక్కడే కొత్తముఖం.  ఆల్‌రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యం వహిస్తాడు. గాయంతో ప్రపంచ కప్‌ మధ్యలో తప్పుకొన్న మరో స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ అందుబాటులోకి రాగా... విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ అందుబాటులో ఉండనని ప్రకటించాడు. అతడి స్థానంలో ఎడంచేతి వాటం ఓపెనర్‌ జాన్‌ క్యాంప్‌బెల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడు. వచ్చే ఏడాది జరుగనున్న టి20 ప్రపంచ కప్‌ను నిలబెట్టుకునే ప్రణాళికల్లో భాగంగా సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు వెస్టిండీస్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రాబర్ట్‌ హేన్స్‌ తెలిపారు. సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20లు ఆగస్ట్‌ 3, 4 తేదీల్లో ఫ్లోరిడా (అమెరికా)లోని లాడర్‌హిల్‌లో జరుగుతాయి. ఆగస్ట్‌ 6న మూడో టి20కి గయానా ఆతిథ్యం ఇవ్వనుంది.

తొలి రెండు టి20లకు విండీస్‌ జట్టు: కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), సునీల్‌ నరైన్, కీమో పాల్, ఖారీ పియర్, కీరన్‌ పొలార్డ్, నికోలస్‌ పూరన్, అంథోని బ్రాంబెల్‌ (వికెట్‌ కీపర్లు), రోవ్‌మన్‌ పావెల్, ఆండ్రీ రసెల్, ఒషాన్‌ థామస్, జాన్‌ క్యాంప్‌బెల్, షెల్డన్‌ కాట్రెల్, షిమ్రన్‌ హెట్‌మైర్, ఎవిన్‌ లూయిస్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top