విండీస్ దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ మరో రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ విండీస్ వీరుడు.. తాజాగా ఓ ప్రపంచ రికార్డును సెట్ చేశాడు. భారత్ వేదికగా జరిగే ఐపీఎల్లో కేకేఆర్కు ఆడే నరైన్.. 2026 ఎడిషన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో నిన్న (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో ఓ వికెట్ (షమీ) తీయడంతో భారత్లో టీ20ల్లో 200 వికెట్లు (183 మ్యాచ్లు) పూర్తి చేసుకున్నాడు.
తద్వారా భారతగడ్డపై ఈ మైలురాయిని తాకిన తొలి విదేశీ బౌలర్గా చరిత్రకెక్కాడు. ఈ విభాగంలో నరైన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో (190), రషీద్ ఖాన్ (188) ఉన్నారు.
నరైన్ భారత్లో ప్రపంచ రికార్డు సెట్ చేసిన మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సునీల్ బంతితో రాణించినా (4-0-13-1) కేకేఆర్కు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రహానే (41), అంగ్క్రిష్ రఘువంశీ (45), కెమెరాన్ గ్రీన్ (39*), రోవ్మన్ పావెల్ (32*) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
అనంతరం కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా రాణించినా ఆయుశ్ బదోని (54), ముకుల్ చౌదరి (54 నాటౌట్) మ్యాచ్ను లాగేసుకున్నారు. ముఖ్యంగా ముకుల్ చౌదరి సిక్సర్లతో విరుచుకుపడి చివరి బంతికి లక్నోను గెలిపించాడు.
ప్రస్తుత ఎడిషన్లో కేకేఆర్కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడి న 4 మ్యాచ్ల్లో 3 ఓటములు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఓడిన 3 మ్యాచ్ల్లో కేకేఆర్ ఆటగాళ్లు రాణించినా, అదృష్టం వారి పంచన లేదు. 4 మ్యాచ్లైనా ఇంకా ఖాతా తెరవకపోవడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టం కానున్నాయి. ఏప్రిల్ 14న జరిగే తదుపరి మ్యాచ్లో కేకేఆర్ సీఎస్కేతో తలపడుతుంది.


