రవిశాస్త్రి వ్యాఖ్యలకు ఎంఎస్‌కే ఘాటు రిప్లై!

Ravindra Jadeja was absolutely fit, MSK Prasad - Sakshi

మెల్‌బోర్న్‌: ఆసీస్‌ పర్యటనలో భాగంగా పెర్త్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్‌ జట్టు కూర్పుపై మీడియా ప్రతినిధులతో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకోలేకపోవడంపై రవిశాస్త్రి ఇచ్చిన వివరణపై చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశాడు.

‘భారత్ జట్టు ఎంపిక ముందు రోజు సాయంత్రం కచ్చితంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ రిపోర్టులని కమిటీ తెప్పించుకుంటుంది. అలానే ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసే ముందు కూడా రిపోర్టుల్ని పరిశీలించాం. అందులో రవీంద్ర జడేజా పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నట్లుగా తెలిసింది. అందుకే.. అతడ్ని జట్టులోకి ఎంపిక చేశాం. ఈ ఎంపిక తర్వాత.. జడేజా.. రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. అక్కడ దాదాపు 60 ఓవర్లకిపైగా బౌలింగ్ కూడా చేశాడు. ఒకవేళ అతను ఫిట్‌గా లేకపోతే.. ఎలా బౌలింగ్ చేస్తాడు..? కాబట్టి.. జడేజా ఫిట్‌గా లేడనే మాటల్లో నిజం లేదు' అని రవిశాస్త్రి వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు ఎమ్మెస్కే.

ఆసీస్‌తో రెండో టెస్టు అనంతరం కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ.. జడేజాను ఎంపిక చేయకపోవడం తాము చేసిన తప్పిదంగా పేర్కొన్నాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ లయన్‌ చెలరేగిన చోట నలుగురు పేసర్లతో చేసిన ప్రయోగం పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదన్నాడు. కాగా, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి రవీంద్ర జడేజా గాయంతోనే ఆసీస్‌ పర్యటనకు వచ్చాడని రవిశాస్త్రి పేర్కొనడం ఇప్పుడు టీమిండియా క్రికెట్‌లో పెద్ద దుమారం రేపింది. రవిశాస్త్రి వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు ఖండించగా, ఆ వ్యాఖ్యలతో చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే సైతం విభేదించడం హాట్‌టాపిక్‌ అయ్యింది.

ఇక్కడ చదవండి: జడేజా పూర్తి ఫిట్‌గా లేడు

బాక్సింగ్‌డే టెస్ట్‌ భారత జట్టు ఇదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top