ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేశారు..

Pakistan whitewash Australia - Sakshi

దుబాయ్‌: పాకిస్తాన్‌తో జరిగినతో మూడు టీ20లో సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్‌వాష్‌ అయ్యింది. యూఏఈ వేదికగా జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలుద్దామని భావించిన ఆసీస్‌కు పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో పాకిస్తాన్‌ 33 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. బాబర్‌ అజమ్‌(50), ఫర్హాన్‌(39)లు శుభారంభం ఇవ‍్వగా, హఫీజ్‌(32 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు.

ఆపై 151 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌ 19.1 ఓవర్లలోనే 117 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆసీస్‌ ఆటగాళ్లలో బెన్‌ మెక్‌డెర్మాట్(21), మిచెల్‌ మార్ష్‌(21)లదే అత‍్యధిక స్కోరు కావడం గమనార్హం. పాక్‌ బౌలర్లలో షాదబ్‌ ఖాన్‌ మూడు వికెట్లతో మెరవగా, హసన్‌ అలీకి రెండు వికెట్లు లభించాయి. ఆష్రాఫ్‌, హఫీజ్‌, ఉస్మాన్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు. ఆసీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను సైతం పాకిస్తాన్‌ 1-0 గెలిచిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌కు కనీసం ఒక్క విజయం కూడా లభించలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top