మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేత మనీషా జోడీ | Maneesha Pair bagged Mixed Doubles Title | Sakshi
Sakshi News home page

మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేత మనీషా జోడీ

Oct 22 2018 10:15 AM | Updated on Oct 22 2018 10:15 AM

Maneesha Pair bagged Mixed Doubles Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెల్లాస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి కె. మనీషా అదరగొట్టింది. గ్రీస్‌లోని చానియా నగరంలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి అర్జున్‌ (భారత్‌)తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో అర్జున్‌–మనీషా (భారత్‌) జంట 21–15, 21–14తో పావెల్‌ పైత్రిజా–ఆగ్నెస్కా వోజ్‌కోస్కా (పోలాండ్‌) జోడీపై గెలుపొందింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జోడీ కేవలం 38 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. వరుస గేముల్లో పోలాండ్‌ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అర్జున్‌– మనీషా జంట 21–12, 21–14తో ఎమిల్‌ హైబెల్‌–లినె ఫ్లెచర్‌ (డెన్మార్క్‌) జోడీపై, క్వార్టర్స్‌లో 21–17, 21–12తో ఉత్కర్ష్‌ అరోరా–కరిష్మా వాడ్కర్‌ (భారత్‌) జంటపై, ప్రిక్వార్టర్స్‌లో 21– 11, 21–10తో గియాన్‌మార్కో బైలెట్టి–లీసా ఇవర్సెన్‌ (ఇటలీ) జోడీపై గెలుపొందింది.

మరోవైపు మహిళల డబుల్స్‌ విభాగంలో మనీషా జంట సెమీస్‌లో పరాజయం పాలైంది. భారత్‌కు చెం దిన సంయోగిత గోర్పాడేతో జతకట్టిన మనీషా సెమీస్‌లో 21–19, 19–21, 17–21తో విమల హెరా యు– మర్గోట్‌ లంబోర్ట్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో భారత జోడీ 21–13, 22–20 తో మోవా సుజు–టిల్డా సుజు (స్విట్జర్లాండ్‌) జం టపై గెలిచింది. ఈ విభాగంలో భారత్‌కే చెందిన రుతుపర్ణ పాండా– ఆరతి సారా సునీల్‌ జంట టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో రుతుపర్ణ– ఆరతి జంట 21–19, 21–12తో విమల హెరా యు– మర్గోట్‌ లంబోర్ట్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement