10కే మూడు వికెట్లు.. కానీ ఈసారి వదల్లేదు!

Lanning And Rachael Haynes Helps To Australia's Win - Sakshi

ఆతిథ్య ఆసీస్‌ బోణి కొట్టింది..

పెర్త్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా బోణి కొట్టింది. భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆసీస్‌.. ఈసారి మాత్రం కడవరకూ పోరాడి గెలుపును ఖాతాలో​ వేసుకుంది. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 123 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌- రాచెల్‌ హేన్స్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి నాల్గో వికెట్‌కు 95 పరుగులు జోడించి పరిస్థితిని గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే రాచెల్‌ హేన్స్‌(60;47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సొగసైన ఇన్నింగ్స్‌ ఆడగా, లానింగ్‌(41 నాటౌట్‌; 44 బంతుల్లో 4 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడింది. కడవరకూ క్రీజ్‌లో ఉండి గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇంకా మూడు బంతులు ఉండగా ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ విజయం సాధించింది. (ఇక్కడ చదవండి: సఫారీ అమ్మాయిల చరిత్ర)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. లంక కెప్టెన్‌ చమారి ఆటపట్టు(50) హాఫ్‌ సెంచరీ సాధించగా,అనుష్క సంజీవని(25), ఉమేషా తిమాష్ని(20)లు మోస్తరుగా ఆడారు. మిగతా టాపార్డర్‌ విఫలం కావడంతో లంక జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అలెసా హీలే డకౌట్‌ కాగా, బెత్‌ మూనీ(6), గార్డనర్‌(2)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ దశలో లానింగ్‌ సమయోచితంగా ఆడింది. రాచెల్‌ హేన్స్‌ ఎఫెన్స్‌కు దిగితే, లానింగ్‌ మాత్రం కుదరుగా ఆడింది. దాంతో మంచి భాగస్వామ్యం రావడంతో ఆసీస్‌ గెలుపును అందుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top