‘అర్జున’కు బుమ్రా, ధావన్‌!

Jasprit Bumrah and Shikhar Dhawan are nominated Arjuna Award - Sakshi

 నామినేట్‌ చేసే యోచనలో బీసీసీఐ  

న్యూఢిల్లీ: భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మరోసారి ‘అర్జున’ అవార్డు బరిలో నిలవనున్నాడు. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు బుమ్రా పేరును బీసీసీఐ నామినేట్‌ చేయనున్నట్లు సమాచారం. 2018లోనే బుమ్రా ఈ అవార్డు బరిలో నిలిచినా... సీనియారిటీ ప్రాతిపదికన రవీంద్ర జడేజా ‘అర్జున’ను కైవసం చేసుకున్నాడు. పురుషుల విభాగంలో ఒకరికంటే ఎక్కువ మంది పేర్లను నామినేట్‌ చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తే బుమ్రాతో పాటు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌కు ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముంది.

రెండేళ్ల క్రితమే శిఖర్‌ ధావన్‌ పేరును బీసీసీఐ సిఫారసు చేసినప్పటికీ అవార్డుల కమిటీ మహిళల విభాగంలో స్మృతి మంధానకు మాత్రమే ఈ గౌరవాన్ని అందించింది. భారత్‌ తరఫున నాలుగేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న 26 ఏళ్ల బుమ్రా 14 టెస్టుల్లో 68 వికెట్లు, 64 వన్డేల్లో 104 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. ‘బుమ్రా కచ్చితంగా ఈ అవార్డుకు అర్హుడు. అతను ఐసీసీ నంబర్‌వన్‌ బౌలర్‌గానూ నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ గడ్డలపై ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు దక్కించుకున్న ఏకైక ఆసియా బౌలర్‌’ అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మహిళల విభాగానికొస్తే ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, పేసర్‌ శిఖా పాండే పేర్లను బోర్డు పరిశీలించే అవకాశముంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top