198 సరిపోలేదు

Indian women's team second match defeat - Sakshi

భారీ స్కోరు చేసినా భారత్‌కు తప్పని ఓటమి

సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన వ్యాట్‌ 

ముంబై: బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించినా... బౌలింగ్‌ వైఫల్యం కారణంగా ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ బృందం 7 వికెట్ల తేడాతో ఓడింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టి20ల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు మిథాలీ రాజ్‌ (43 బంతుల్లో 53; 7 ఫోర్లు), స్మృతి మంధాన (40 బంతుల్లో 76; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) 12.5 ఓవర్లలో తొలి వికెట్‌కు 129 పరుగులు జతచేశారు.

ఈ క్రమంలో స్మృతి 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుంది. భారత్‌ తరఫున ఇదే వేగవంతమైన అర్ధ సెంచరీ. భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో డానియెలా వ్యాట్‌ (64 బంతుల్లో 124; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆటే హైలైట్‌గా నిలిచింది. విజయానికి మరో 16 పరుగుల దూరంలో దీప్తి శర్మ (2/36) బౌలింగ్‌లో ఆమె  వెనుదిరిగినా... స్కీవర్‌ (12 నాటౌట్‌), కెప్టెన్‌ హెతెర్‌ (8 నాటౌట్‌) మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే 199/3తో జట్టును గెలిపించారు. మహిళల అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top