
ఇది గంభీర్ కు ఆఖరి అవకాశమా?
న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు అనూహ్యంగా ఎంపికైన వెటరన్ ఆటగాడు గౌతం గంభీర్ ముందు ఇప్పుడు ఒకే ఒక సవాల్ ఉంది.
ఇండోర్:న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు అనూహ్యంగా ఎంపికైన వెటరన్ ఆటగాడు గౌతం గంభీర్ ముందు ఇప్పుడు ఒకే ఒక సవాల్ ఉంది. అది భారత క్రికెట్ టెస్టు జట్టులో స్థానం నిలబెట్టుకోవడమే. ప్రస్తుతం యువ క్రికెటర్లతో టీమిండియా జట్టు నిండిపోవడంతో గౌతీ పరిస్థితి డోలాయమానంలో పడింది. వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను చాటుకుంటూ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవడంతో ఆ సవాల్ ను గౌతం గంభీర్ అధిగమించాల్సి ఉంది.
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో గౌతం గంభీర్ కు రెండో టెస్టులో స్థానం కల్పించారు. అయితే ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు శిఖర్ ధవన్ కు గాయం కావడంతో మూడో టెస్టులో గంభీర్ ఆడటం దాదాపు ఖాయమైంది. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేలు గంభీర్ ఎంపికపై ఆసక్తిగా ఉండటంతో ఆ సీనియర్ క్రికెటర్ చివరి టెస్టులో ఆడే అవకాశం మెండుగా ఉంది.
ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో రాణించడమే గంభీర్ ఎంపికకు ప్రధాన కారణం . ఆ ట్రోఫీలో ఇండియా బ్లూకు నాయకత్వం వహించిన గంభీర్ ఐదు ఇన్నింగ్స్ లు ఆడి 356 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. దాంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్ లో కూడా గంభీర్ ఐదు వందలకు పైగా పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్ లో అత్యధికం పరుగులు చేసిన నాల్గో ఆటగాడిగా గంభీర్ నిలిచాడు. మరి ఇవన్నీ గంభీర్ తాజా ఎంపికకు ఒక కారణమైతే, చివరి టెస్టు మాత్రం అతనికి కచ్చితంగా చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.మరి గంభీర్ రాణించి అవకాశాన్ని పదిలం చేసుకుంటాడా?లేదా?అనేది ఆసక్తికరం. శనివారం నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి దైన మూడో టెస్టు ఇండోర్ లో జరుగునుంది.