పంజాబ్‌తో కళింగ అమీతుమీ | Hockey India League final match | Sakshi
Sakshi News home page

పంజాబ్‌తో కళింగ అమీతుమీ

Feb 21 2016 12:35 AM | Updated on Sep 3 2017 6:03 PM

డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) సెమీఫైనల్లోనే

సెమీస్‌లో ఓడిన రాంచీ రేస్, ఢిల్లీ
హాకీ ఇండియా లీగ్

 
రాంచీ: డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) సెమీఫైనల్లోనే నిష్ర్కమించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ షూటౌట్ దాకా వెళ్లగా కళింగ లాన్సర్స్ 6-4తో రాంచీకి షాక్ ఇచ్చింది. దీంతో ఈ లీగ్‌లో తొలిసారిగా కళింగ ఫైనల్‌కు వెళ్లింది. ఆదివారం జరిగే తుది పోరులో కళింగ జట్టు పంజాబ్  వారియర్స్‌ను ఢీకొంటుంది. అంతకుముందు నిర్ణీత సమయంలో కళింగ, రాంచీ జట్లు 2-2తో సమంగా నిలిచాయి. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. దీంట్లో మొదట రాంచీ రేస్ నుంచి కెప్టెన్ ఆష్లే జాక్సన్ తొలి ప్రయత్నాన్ని విఫలం చేయగా ఆ తర్వాత సర్వన్‌జిత్, మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేశారు. అయితే నాలుగో షాట్‌ను మిడిల్‌టన్ గోల్‌గా మలచలేకపోయాడు. అటు కళింగ జట్టుకు కెప్టెన్ మోరిట్జ్ ఫ్యుయర్‌స్టే, క్యాస్పర్స్, లలిత్, జలెక్సి వరుసగా చేసిన గోల్స్‌తో జట్టు ఫైనల్‌కు చేరింది.

మూడోసారి పంజాబ్ ఫైనల్లోకి..
అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై 3-1తో నెగ్గిన పంజాబ్ వారియర్స్ వరుసగా మూడోసారి ఫైనల్లోకి వెళ్లింది. ఢిల్లీ నుంచి రూపిందర్ పాల్ సింగ్ 6వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టుకు అర్మాన్ ఖురేషి (13) ఫీల్డ్ గోల్ చేయగా సైమన్ ఆర్కర్డ్ (51) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విజయాన్ని అందించాడు.
 
  ఫైనల్ మ్యాచ్
 సా. 5.20 నుంచి
  స్టార్ స్పోర్ట్స్-2లో
  ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement
 
Advertisement
Advertisement