విసిరేసి పడిపోతే.. పడిపోయి పట్టేశాడు..! | Du Plessis And Miller Joint Effort Help To Dismiss Mitchell Mars | Sakshi
Sakshi News home page

విసిరేసి పడిపోతే.. పడిపోయి పట్టేశాడు..!

Feb 24 2020 5:48 PM | Updated on Feb 24 2020 5:56 PM

Du Plessis And Miller Joint Effort Help To Dismiss Mitchell Mars - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తొలి టీ20లో ఆసీస్‌ గెలిస్తే, అందుకు సఫారీలు ఘనంగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా, ఆసీస్‌ను 146 పరుగులకే కట్టడి చేసి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌-డేవిడ్‌ మిల్లర్‌లు పట్టిన క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది. లక్ష్య ఛేదనలో భాగంగా లుంగి ఎన్‌గిడి వేసిన 18 ఓవర్‌ ఐదో బంతిని ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్ట్రైట్‌గా సిక్స్‌ కొట్టే యత్నం చేశాడు. అయితే ఆ క్యాచ్‌ కోసం బౌండరీ లైన్‌ వద్దకు డుప్లెసిస్‌-మిల్లర్‌లు ఇద్దరూ పరుగెత్తుకొచ్చారు. 

ముందుగా డుప్లెసిస్‌ క్యాచ్‌ను పట్టేసి బౌండరీ లైన్‌ లోపల పడే సమయంలో బంతిని గ్రౌండ్‌లోపలికి వేగంగా విసిరేయగా, దాన్ని మిల్లర్‌ వృథా కానివ్వ లేదు. ఆ బంతిని ఎంతో చాకచాక్యంతో పట్టేసుకుని గ్రౌండ్‌లో పడిపోయాడు. క్యాచ్‌ను పట్టే క్రమంలో ఇలా ఒకరు బంతిని విసిరేసి పడిపోతే, మరొకరు పడిపోయి మరీ ఒడిసి పట్టుకోవడం సఫారీల చురుకైన ఫీల్డింగ్‌కు అద్దం పడుతోంది. ఇదే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది. మిచెల్‌ మార్ష్‌ ఔటయ్యే సమయానికి ఆసీస్‌ 138 పరుగులతో ఉంది. ఆ తర్వాత  మాథ్యూ వేడ్‌(1), ఆస్టన్‌ ఆగర్‌(1)లు నిరాశపరచడంతో ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. డేవిడ్‌ వార్నర్‌(67 నాటౌట్‌) చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్‌లో ఆసీస్‌ విజయానికి 17 పరుగులు కావాల్సి న తరుణంలో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచి సిరీస్‌ను సమం చేసింది.సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం జరగనుంది. (ఇక్కడ చదవండి: సమష్టి వైఫల్యం.. 10 వికెట్ల పరాభవం)

Advertisement
 
Advertisement
Advertisement