
చహల్ 51 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా వరల్డ్కప్ అరంగేట్ర మ్యాచ్లో..
సౌతాంప్టన్ : అంచనాలకు తగ్గకుండా ఆడిన టీమిండియా ప్రపంచకప్లో శుభారంభం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుత ఆటతో తమ తొలి మ్యాచ్లో సునాయాస విజయం సాధించింది. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ (144 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీకి తోడు.. మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4/51) మాయాజాలం, పేసర్ జస్ప్రీత్ బుమ్రా (2/35) పకడ్బందీ బౌలింగ్తో భారత్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. బుధవారం జరిగిన ఇండియా-సౌతాప్రికా మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేయగా.. 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.
ఇక ఈ మ్యాచ్లో చహల్ 51 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా వరల్డ్కప్ అరంగేట్ర మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రెండో భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. 2015-ప్రపంచకప్లో పాకిస్తాన్తో జరిగిన అరంగేట్ర మ్యాచ్లో మహ్మద్ షమీ ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 35 పరుగులే ఇచ్చిన నాలుగు వికెట్లు నేల కూల్చాడు. డసెన్, డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో వికెట్లు పడగొట్టిన చహల్ భారీ భాగస్వామ్యాలు నమోదు కాకుండా అడ్డుకున్నాడు. 54 పరుగులు జోడించి ప్రమాదకరంగా పరిణమించిన డసెన్, డుప్లెసిస్ జోడిని చహల్ 20వ ఓవర్లో విడగొట్టాడు. తొలిబంతికి డసెన్ను చివరి బంతికి డుప్లెసిస్ను పెవిలియన్ చేర్చాడు. ఇక 46 పరుగులు భాగస్వామ్యంతో నెలకొల్పిన మిల్లర్, ఫెలుక్వాయోను ఔట్ చేసి సఫారీ జట్టుని కోలుకోలేని దెబ్బతీశాడు.